సూపర్ ఓవర్లు.. సంచలన ఫలితాలతో ముందుకెళ్తున్న టీ20 ప్రపంచకప్లో బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. చిరుకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య నేడు(ఆదివారం) హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. న్యూయార్క్లోని నాసౌ కౌంటీ క్రికెట్ మైదానం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది.
ఇప్పటికే ఈ మ్యాచ్పై హైప్ క్రియేట్ అవ్వగా.. ఇరు జట్ల మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలు, అంచనాలతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నారు.
తాజాగా విరాట్ కోహ్లీని ఉద్దేశించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ విషయంలో టీమిండియా ఘోర తప్పిదం చేస్తుందన్నాడు.

అతన్ని ఓపెనర్గా ఆడించడం బ్లండర్ మిస్టేక్ అని, ఫస్ట్ డౌన్లోనే బ్యాటింగ్కు పంపాలని సూచించాడు. అప్పుడే తన అనుభవంతో కోహ్లీ తీవ్ర ఒత్తిడిని అధిగమించి జట్టుకు కావాల్సిన పరుగులు చేయగలడని అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగ్గా ఉందని అనుకోవడం లేదు. కోహ్లీ ఫస్ట్ డౌన్లో ఆడితే ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ను ముగించగలడు.
ఇది టీమిండియాకు చాలా ముఖ్యం. యశస్వి జైస్వాల్ను ఓపెనర్గా.. విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో ఆడించాలి. అలా కాకుండా కోహ్లీనే ఓపెనర్గా కొనసాగించాలని టీమిండియా భావిస్తే ఏదో మ్యాచ్లో ఇబ్బంది పడుతుంది. కోహ్లీ ఒక ఎండ్లో ఉంటూ మ్యాచ్ను ముగించాలి. విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడిస్తూ టీమిండియా తప్పిదం చేస్తుంది.'అని కమ్రాన్ అక్మల్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
ఏ లెక్కన చూసుకున్నా పాకిస్థాన్ కంటే భారత్ మెరుగ్గా ఉందని, టీమిండియానే హాట్ ఫేవరేట్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. 'టీమిండియా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. బుమ్రా, సిరాజ్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టీమిండియాకు ఒకే వేదికపై మూడు మ్యాచ్లు ఉన్నాయి. ఇది కూడా వారికి కలిసొచ్చే అంశం. ఇక బిగ్ మ్యాచ్లకు అయినా ఐసీసీ మెరుగైన పిచ్లు సిద్దం చేయాలి. లేకుంటే జనాలు ఈ ప్రపంచకప్ను పట్టించుకోరు.'అని కమ్రాన్ అక్మల్ హెచ్చరించాడు.