పల్లెకెలె: ఆసియాకప్ 2023లో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 267 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఇషాన్ కిషన్(81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 82), హార్దిక్ పాండ్యా(90 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 87) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో266 పరుగులకు కుప్పకూలింది.
ఈ ఇద్దరూ ఐదో వికెట్కు 138 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. చివర్లో బుమ్రా(16) విలువైన పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, నసీమ్ షా మూడేసి వికెట్లు తీసారు.

శుభారంభం లేదు..:టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. షాహిన్ షా అఫ్రిది సంచలన బౌలింగ్తో టీమిండియాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4)లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ముందుగా రోహిత్ శర్మ... షాహిన్ షా అఫ్రిది ఇన్స్వింగర్కు క్లీన్ బౌల్డ్ అవ్వగా.. కోహ్లీ ఔట్ స్వింగర్ను ఆడబోయి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఈ ఇద్దరూ మరోసారి తమ స్వింగ్ బౌలింగ్ బలహీనతను బయటపెట్టుకున్నారు.
అయ్యర్, గిల్ విఫలం..:అనంతరం క్రీజులోకి వచ్చి బౌండరీలతో సెట్ అయ్యే ప్రయత్నం చేసిన శ్రేయస్ అయ్యర్ను హ్యారీస్ రౌఫ్ పెవిలియన్ చేర్చాడు. సూపర్ ప్లాన్తో అతని షార్ట్ పిచ్ బాల్ బలహీనతపై దెబ్బకొట్టాడు. ఫార్వార్డ్ ఫీల్డర్ పెట్టి ఊరించే షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు. ఇక క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్తో శుభ్మన్ గిల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 3 వికెట్లకు 48 పరుగులు చేసింది.
ఇక ఆచితూచి ఆడుతున్న శుభ్మన్ గిల్(10)ను హ్యారీస్ రౌఫ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో టీమిండియా 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా..:ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. మిడిల్ ఓవర్లలో క్విక్ సింగిల్స్తో ఇన్నింగ్స్ను నిలబెట్టింది. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి మెచ్యూర్గా బ్యాటింగ్ చేసిన ఇషాన్ కిషన్.. తనదైన షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.
ఈ క్రమంలో 54 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో ఇషాన్ కిషన్కు ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. వెస్టిండీస్ పర్యటనలో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్.. పాకిస్థాన్తోనూ అదే జోరు కొనసాగించాడు. ఆ వెంటనే హార్దిక్ పాండ్యా 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాకిస్థాన్ చెత్త ఫీల్డింగ్ కూడా భారత జోడీకి కలిసొచ్చింది.
దెబ్బతీసిన హ్యారీస్ రౌఫ్...:138 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హ్యారీస్ రౌఫ్ విడదీసాడు. ఊరించే బౌన్సర్తో ఇషాన్ కిషన్ను బోల్తా కొట్టించాడు. బౌన్సర్తో టెంప్ట్ అయిన ఇషాన్ కిషన్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
ఇషాన్ ఔటైనా.. జడేజాతో కలిసి హార్దిక్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. వరుస బౌండరీలతో చెలరేగిన హార్దిక్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ పాకిస్థాన్ సెన్సేషన్ షాహిన్ షా అఫ్రిది అతని జోరుకు బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి దెబ్బతీసాడు. ఆ వెంటనే జడేజాను కూడా ఔట్ చేసి భారత భారీ స్కోర్ను అడ్డుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్(3) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. నసీమ్ షా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా విలువైన పరుగులు జోడించారు. కుల్దీప్(4)ను నసీమ్ షాను ఔట్ చేసినా.. సిరాజ్తో కలిసి బుమ్రా ఓ బౌండరీ బాదాడు. కానీ అదే జోరులో భారీ సిక్సర్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరగడంతో భారత్ 266 పరుగులకు ఆలౌటైంది.