ఆసియా కప్ 2025లో భాగంగా పాకిస్థాన్తో హైఓల్టేజ్ మ్యాచ్కు టీమిండియా సిద్దమైంది. మరికొద్ది గంటల్లో దుబాయ్ వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు దాయాదీ పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల తర్వాత జరుగుతున్న ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాక్తో మ్యాచ్ వద్దనే నిరసనల మధ్య టీమిండియా బరిలోకి దిగుతోంది.
శత్రు దేశమైన పాకిస్థాన్తో మ్యాచ్ అంటేనే మెజార్టీ భారతీయులు అంగీకరించడం లేదు. అలాంటిది ఆ జట్టు చేతిలో ఓటమి అంటే ఏ మాత్రం సహించరు. ఈ విషయాన్ని మదిలో పెట్టుకొనే భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తే హీరోలవుతారు. అలా కాకుండా ఓడితే మాత్రం జీరోలుగా మిగిలిపోతారు. గత చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత ఫామ్ను పరిగణలోకి తీసుకున్నా టీమిండియానే హాట్ ఫేవరేట్గా కనిపిస్తోంది. టీ20ల్లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్గా ఉండగా.. పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది.

అంతేకాకుండా పాక్లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది. మరోవైపు భారత్.. వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది. కానీ ప్రస్తుత భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్తో సహా ఐదుగురు ఆటగాళ్లు ఇప్పటి వరకు పాకిస్థాన్తో ఒక్క మ్యాచ్ ఆడలేదు. మిగతా ప్లేయర్లలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్లకు మినహా ఏ ఒక్కరికి మెరుగైన గణంకాలు లేవు.
అంతేకాకుండా పాకిస్థాన్ జట్టులోని స్పిన్నర్లు సూపర్ ఫామ్లో ఉండటం అభిమానులను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆ జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ మంచి జోష్లో ఉన్నాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందే అఫ్గానిస్థాన్, యూఏఈతో జరిగిన ట్రై సిరీస్లో నవాజ్ సంచలన ప్రదర్శనతో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. ముఖ్యంగా అఫ్గాన్తో జరిగిన ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్తో పాటు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. అతన్ని టీమిండియా బౌలర్లు జాగ్రత్తగా ఆడాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అలా కాకుండా గుడ్డిగా ఆడితే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తున్నారు.
భారత్తో మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాకిస్థాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ కూడా మహమ్మద్ నవాజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుత సమయంలో నవాజ్ వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అని పేర్కొన్నాడు. అతనితో పాటు అబ్రర్, సుఫియన్లు కూడా తమకు కీలకం కానున్నారని చెప్పాడు.