ఓయ్ అంపైర్ నిద్రపోతున్నావా
ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. షహీన్ షా ఆఫ్రిది వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ తొలి బంతికి రాహుల్ బౌల్డయ్యాడు. కానీ బంతి వేసినపుడు షహీన్ కాలు గీత దాటింది. వాస్తవానికి అది నో బాల్. ఇదే వీడియోలో కూడా స్పష్టంగా కనిపించింది. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ఫొటో, వీడియోలు చూసిన భారత ఫాన్స్ మండిపడుతున్నారు. 'ఇదేం అంపరింగ్', 'మంచి ఫామ్లో ఉన్న రాహుల్ను ఔట్ చేశాడు' అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 'ఓయ్ అంపైర్ నిద్రపోతున్నావా', 'రాహుల్ను అలా ఎలా ఔట్ ఇచ్చావ్', 'టీమిండియాను ముంచావ్ కదయ్యా', 'రాహుల్ నో బాల్కు ఔట్ అయ్యాడు' అంటూ ఫాన్స్ మండిపోతున్నారు.
పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా
నిజానికి టీ20 ప్రపంచకప్ 2021లో బ్యాటర్లు ఔటైన ప్రతి బంతినీ.. అంపైర్లు లీగల్ డెలివరీయేనా కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్లోనూ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన బంతిని అంపైర్లు చాలాసార్లే చెక్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ ఔటైన బంతిని కూడా అంపైర్లు చెక్ చేశారు. కానీ పూర్తి స్థాయిలో చెక్ చేయకుండా అంపైర్లు ఉదాసీనతతో వ్యవహరించారు.
మ్యాచ్ చూస్తున్న అందరూ రాహుల్ ఔట్ కాదనే ధీమాతో ఉండగా.. అంపైర్లు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. దాంతో నెటిజన్లు మండిపడుతున్నారు. వాస్తవానికి రాహుల్ ఔట్ కాకపోయుంటే.. భారత్ భారీ స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ ఐపీఎల్ 2021లో దుమురిపిన విషయం తెలిసిందే.
Babar Azam: మాట నిలబెట్టుకున్న బాబర్.. చెప్పినట్టే టీమిండియాను ఓడించాడుగా! హేమాహేమీల వల్లే కాలేదు!
31 పరుగులకే మూడు వికెట్లు
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల సాధారణ స్కోర్ చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ (0) షహీన్ షా ఆఫ్రిది బౌలింగ్లో డకౌటయ్యాడు. ఆపై మూడో ఓవర్లో లోకేష్ రాహుల్ పెవిలియన్ చేరాడు. కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (11) సైతం ఔటవ్వడంతో భారత్ 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) పోరాడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. చివర్లో ధాటిగా ఆడతారనుకున్న రవీంద్ర జడేజా (13), హార్దిక్ పాండ్యా (11) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఆడుతూ పాడుతూ
భారత్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్.. బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంతగడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే వేగంగా ఆడారు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో 4, 6తో మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6) దంచుడు షురూ చేశాడు. బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) కూడా ధాటిగానే ఆడాడు. తొలి నాలుగు ఓవర్లను నలుగురు వేర్వేరు బౌలర్లతో వేయించినా.. భారత్కు ఒక్క వికెట్ దక్కలేదు. మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్ ఓపెనర్లు.. చెత్త బంతులపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో పాక్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ పరుగులు చేశారు. దాంతో మరో 13 బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది.


Click it and Unblock the Notifications












