కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్..
గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను భారత జట్టు ఓడించింది. దాదాపు ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 82 నాటౌట్) వరల్డ్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి చారిత్రాత్మక విజయాన్నందించాడు. ఏమాత్రం గెలిచే అవకాశాలు లేని పరిస్థితుల నుంచి తీవ్ర ఒత్తిడి అసాధారణ బ్యాటింగ్తో జట్టును గెలిపించాడు.
జెమీమా సైతం..
తాజాగా పాక్ మహిళల జట్టుతోనూ టీమిండియా దాదాపు అదే పరిస్థితి ఎదుర్కొంది. పాకిస్థాన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా.. విజయం కోసం 36 బంతుల్లో 55 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ రేకెత్తింది. జెమీమా, రిచా ఎంత ప్రయత్నించినా ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి 14 పరుగులే వచ్చాయి. దీంతో సమీకరణం 24 బంతుల్లో 41 పరుగులుగా మారింది. ఓవర్కు 10కి పైగా రన్రేట్తో పరుగులు సాధించాల్సి రావడంతో భారత్ గెలవడం కష్టమేననిపించింది.
హ్యాట్రిక్ ఫోర్లతో..
భారీ షాట్లను అలవోకగా ఆడగలిగే రిచా..18 ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో కథ మలుపు తిప్పింది. ఆ ఓవర్లో మొత్తం 14 పరుగులు రావడంతో జట్టు గెలుపునకు 12 బంతుల్లో 14 పరుగులు కావాల్సి వచ్చింది. ఇన్నింగ్స్కు ఇరుసులా నిలిచిన జెమీమా 19వ ఓవర్లో మూడు ఫోర్లతో పని పూర్తి చేసింది. రెండో బంతికి ఆఫ్సైడ్ జరిగి స్క్వేర్లెగ్లో బౌండరీ సాధించి ఒత్తిడి తగ్గించుకున్న ఆమె.. చివరి రెండు బంతులకు ఫోర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు అర్ధశతకాన్ని చేరుకుంది.

పాక్ అంటే.. మూడో నంబర్కే మూడ్..
కాకతాళీయమో ఏమో కానీ టీ20 ప్రపంచకప్ల్లో మూడో స్థానంలో దిగిన భారత బ్యాటర్లే పాకిస్థాన్ పతనాన్ని శాసిస్తున్నారు. పురుషుల టోర్నీలో విరాట్ కోహ్లీ(82 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పాకిస్థాన్ను ఓడిస్తే.. మహిళల టీ20 ప్రపంచకప్లో మూడో స్థానంలోనే బరిలోకి దిగిన జెమీమా(53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీ పాక్ మహిళల పతనాన్ని శాసించింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న నెటిజన్లు.. పాక్ అంటే మూడో నెంబర్కు మూడ్ వస్తున్నట్లుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టాట్ నెట్టింట చర్చనీయాంశమైంది.

భారత్ బోణీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ బిస్మా మారూఫ్ ( 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. అయేషా నసీమ్ ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్తో మెరిసింది. భారత బౌలర్లలో రాధ యాదవ్ (2/21) రాణించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.


Click it and Unblock the Notifications
