IND vs PAK: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. ఈ పిచ్పై తమకు అవగాహన ఉందని, తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగుతున్నామని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కొంచెం జిగటగా కనిపిస్తోంది. కాబట్టి మొదటి కొన్ని ఓవర్లలో ఇది బౌలర్లకు సహకరిస్తుందని భావిస్తున్నాం. మా జట్టు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ఎస్ఎస్సీ గ్రౌండ్ కంటే ఇది పెద్దది. పిచ్ కూడా అక్కడి కంటే నెమ్మదిగా ఉంటుంది. మేం మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం.'అని సల్మాన్ అఘా పేర్కొన్నాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. తమ జట్టులో రెండు మార్పులు జరిగాయని చెప్పిన సూర్య.. అభిషేక్, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నాడు. 'టాస్ ఓడినా ఏం పర్వాలేదు. మేం ముందుగా బ్యాటింగే చేయాలనుకున్నాం. గత రెండు మ్యాచ్ల్లో లక్ష్యాన్ని కాపాడుకుని గెలిచాం. కాబట్టి ఆ పంథాను కొనసాగించాలనుకుంటున్నాం. ఇదొక గొప్ప సందర్భం. అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్. ఈ ఆట మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. జట్టులో రెండు మార్పులు చేశాం. అభిషేక్ శర్మ తుది జట్టులోకి వచ్చాడు. అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్ సందర్భంగా కూడా పాకిస్థాన్ కెప్టెన్కు సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆసియా కప్ సంప్రదాయాన్ని భారత్ ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. షేక్ హ్యాండ్ ప్రొటోకాల్ను తీసుకురావాలని ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసినా.. భారత జట్టు మాత్రం పట్టించుకోలేదు.
పాకిస్థాన్: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజం, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్.
భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.