చెలరేగిన అర్ష్దీప్ సింగ్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకున్నారు. దాంతో పాక్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డారు. యువ పేసర్ అర్షదీప్ సింగ్ తన వరుస ఓవర్లలో బాబర్ ఆజామ్(0), మహమ్మద్ రిజ్వాన్(4)లను ఫెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 32 పరుగులు మాత్రమే చేసింది. ఈ పరిస్థితుల్లో షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్ ఆచితూచి ఆడారు.
నిదానంగా ఆడుతూనే వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ముఖ్యంగా ఇఫ్తికర్ అహ్మద్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా అక్షర్ పటేల్ బౌలింగ్లో మూడు భారీ సిక్స్లు బాది పాక్ ఇన్నింగ్స్ను సెట్ చేశాడు.
ఇఫ్తికర్ హాఫ్ సెంచరీ..
ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను ఆ వెంటనే ఔటయ్యాడు. షమీ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాదాబా ఖాన్(5), హైదర్ అలీ(2)లను హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్లో షార్ట్ బాల్స్తో బోల్తా కొట్టించాడు. అదే జోరులో తన చివరి ఓవర్లో మహమ్మద్ నవాజ్(9)ను కూడా హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ(2)ని అర్ష్దీప్ సింగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడంతో పాక్ ఇన్నింగ్స్ 130 పరుగులకే ముగుస్తుందేమోనని అంతా అనుకున్నారు.
షాన్ మసూద్ పోరాటం..
కానీ ఈ పరిస్థితుల్లో షాన్ మసూద్ సూపర్ బ్యాటింగ్తో జట్టు స్కోర్ను ముందుకుతీసుకెళ్లాడు. నిదానంగా ఆడినా.. విలువైన హాఫ్ సెంచరీతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. ఏకంగా మూడు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి అతను తప్పించుకున్నాడు. షాహిన్ షా అఫ్రిది కూడా సిక్స్, బౌండరీ కొట్టి విలువైన పరుగులు జోడించాడు. భువీ అతన్ని పెవిలియన్ చేర్చినా.. ఆఖరి ఓవర్ హరీస్ రౌఫ్ సిక్సర్ బాది జట్టు స్కోర్ను 159 పరుగులకు చేర్చాడు.


Click it and Unblock the Notifications
