ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆదివారం దాయాదీ పాకిస్థాన్తో జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అయితే ఈ మ్యాచ్లో పాక్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా అలియాస్ అభయ్ సింగ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐఐటీ బాబా ఎక్కడ? అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో ఎక్స్ వేదికగా #IITianBaba యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
ఐఐటీ బాబా.. కింగ్ ముందు కథలా?
విరాట్ కోహ్లీతో పాటు ఇతర స్టార్ బ్యాటర్లు ఉన్నా.. పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని శనివారం ఐఐటీ బాబా జోస్యం చెప్పాడు. భారత్ ఎలా గెలుస్తుందో చూద్దామని కూడా అన్నాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో అతనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఇప్పుడు నీ జోస్యం ఏమైంది?, కింగ్ విరాట్ కోహ్లీ ముందు జోస్యాలు పనిచేయవ్'అని కామెంట్ చేస్తున్నారు. జ్యోతిష్యం చెప్పడం మానేయాలని కూడా హితవు పలుకుతున్నారు. పబ్లిసిటీ కోసమే ఐఐటీ బాబా భారత్ ఓడిపోతుందని చెప్పాడని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఎవరీ ఐఐటీ బాబా?
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహాకుంభమేళాకు అభయ్ సింగ్.. ఓ జాతీయ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. తాను ఐఐటీ బాంబే నుంచి డిగ్రీ పొందిన ఏరోస్పేస్ ఇంజనీర్ను అని, కెనడాలో అధిక జీతంలో ఉద్యోగం కూడా చేసినట్లు తెలిపాడు. దాంతో కుంభమేళాలో ఐఐటీ బాబాగా ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. దాంతో అతనికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. పాక్తో మ్యాచ్లో భారత్ ఓడిపోవాలని రాసి పెట్టి ఉందని, ఎవరూ ఆడినా విజయం దక్కదని తెలిపాడు. కానీ ఈ మ్యాచ్లో భారత్ సునాయస విజయాన్ని సాధించింది.
కోహ్లీ శతకం.. భారత్ విజయం
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్(76 బంతుల్లో 5 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీతో రాణించగా.. మహమ్మద్ రిజ్వాన్(77 బంతుల్లో 3 ఫోర్లతో 46), కుష్దిల్ షా(39 బంతుల్లో 2 సిక్స్లతో 38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/40) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీసారు. హార్దిక్ పాండ్యా(2/31)కు రెండు వికెట్లు దక్కాయి.
అనంతరం భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్మన్ గిల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(2/74) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, కుష్దీల్ షా తలో వికెట్ పడగొట్టారు.