ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ షాహీన్స్ మధ్య జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్-ఏ ప్లేయర్ నెహాల్ వధేరా బౌండరీ లైన్పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కానీ థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ షాహిన్స్ బ్యాటింగ్ సందర్భంగా సుయాష్ శర్మ వేసిన 10వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని పాకిస్థాన్ షాహీన్స్ ఓపెనర్ మాజ్ సదాఖత్ భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్పై నెహాల్ వధేరా అద్భుతంగా రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన అతను గాల్లోకి విసిరేసాడు. అతనికి సమీపంగా ఉన్న నమన్ ధీర్ ఆ బంతిని అందుకున్నాడు.
క్యాచ్ పూర్తయిందని భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. మాజ్ సదాఖత్ పెవిలియన్ బాట పట్టాడు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దాంతో అంతా అవాక్కయ్యారు. భారత్-ఏ కెప్టెన్ జితేష్ శర్మ.. అంపైర్లను వివరణ కోరాడు. బౌండరీ లైన్ క్యాచ్ల విషయంలో సవరించిన రూల్స్ ప్రకారం ఇది నాటౌట్ అని అంపైర్లు అతనికి వివరించారు.
ఈ ఏడాది జూన్లో మెరిల్బోన్ క్రికెట్ క్లబ్(MCC) బౌండరీ లైన్(బన్నీ హాప్)క్యాచ్ల నిబంధనల్లో మార్పులు చేసింది. పాత రూల్స్ ప్రకారం బౌండరీ వెలుపల గాలిలో ఉన్నప్పుడు ఫీల్డర్ బంతిని ఎన్నిసార్లైనా తాకడానికి అవకాశం ఉండేది. కానీ సవరించిన రూల్స్ ప్రకారం.. బౌండరీ బయట ఉన్న ఫీల్డర్.. బంతి గాలిలో ఉన్నప్పుడు తాకడానికి ఒకే ఒక అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బంతిని గాల్లో తాకిన తర్వాత అది డెడ్ అయ్యే వరకు ఫీల్డర్ తప్పనిసరిగా మైదానంలో లోపలనే ల్యాండ్ అవ్వాలి. కొత్త నియమం ప్రకారం.. గాల్లోకి ఎగిరి బంతిని లోపల ఉన్న మరో ఫీల్డర్కు అందించడం, తిరిగొచ్చి అందుకోవడం వంటి బన్నీ హాప్ క్యాచ్లను రద్దు చేశారు. ఒకవేళ లోపలికి బంతిని అందించిన సదరు ఫీల్డర్ మైదానంలోకి రావాలి. బయట మైదానాన్ని ఒకేసారి తాకాలి.

ఈ కొత్త రూల్స్ నేపథ్యంలోనే నెహాల్ వధేరా, నమన్ ధీర్ అందుకున్న క్యాచ్ను అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. పాకిస్థాన్ బ్యాటర్లు పరుగెత్తకపోవడంతో వారికి సింగిల్ దక్కలేదు. సిక్స్ అడ్డుకోవడంతో వారికి బౌండరీ కూడా రాలేదు. ఇది తెలియని ఫ్యాన్స్ అంపైర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అవకాశంతో చెలరేగిన మాజ్ సదాఖత్ పాక్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ(28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 45), నమన్ ధీర్(20 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 35) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన పాకిస్థాన్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మాజ్ సదాఖత్ (47 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 79 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. భారత్-ఏ బౌలర్లలో యశ్ ఠాకూర్, సుయాశ్ శర్మ చెరో వికెట్ తీసారు.