ఆసియా కప్ 2025 టోర్నీ భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్ గొడవపడ్డారు. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విధ్వంసాన్ని తట్టుకోలేకపోయిన హారిస్ రౌఫ్.. తన నోటికి పనిచెప్పాడు. అతని మాటలకు ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ తగ్గేదేలే అంటూ మైదానంలోనే గొడవకు దిగాడు. అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడదీసారు.
భారత బ్యాటింగ్ సందర్భంగా ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లోనూ అభిషేక్ శర్మ భారీ సిక్సర్తోనే తన ఇన్నింగ్స్ ప్రారంభించాడు. షాహిన్ అఫ్రిది, అబ్రర్ అహ్మద్, సైమ్ అయుబ్లతో పాటు హరిస్ రౌఫ్లను అభిషేక్ శర్మ చితక్కొట్టాడు. అభిషేక్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ కూడా చెలరేగడంతో 4.3 ఓవర్లలోనే భారత్ 47 పరుగులు చేసింది. తన బౌలింగ్లో బౌండరీ బాదిన అభిషేక్ శర్మపై హరిస్ రౌఫ్ నోరు పారేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్తో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదిన అభిషేక్ శర్మ.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 50 సిక్స్లు బాదిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 331 బంతుల్లోనే అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో అభిషేక్ శర్మ(331) తర్వాత ఎవిన్ లూయిస్(366), ఆండ్రీ రస్సెల్(409), హజ్రతుల్లా జజై(492), సూర్యకుమార్ యాదవ్(510) ఉన్నారు. ఈ మ్యాచ్లో మొత్తం 39 బంతులాడి 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74 పరుగులు చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అభిషేక్ శర్మ విధ్వంసంతో పాకిస్థాన్కు జరగాల్సిన నష్టం జరిగింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేయడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది.
అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. అభిషే శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ తీసారు.