ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన జోరు కొనసాగిస్తున్నాడు. ప్రత్యర్థితో పనిలేకుండా చెలరేగుతున్నాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా బాదడం అలవాటు మార్చుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనకు దిగినా ఐ డోంట్ కేర్ అన్న రీతిలో చెలరేగుతున్నాడు.
యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లోనూ ఫస్ట్ బాల్నే సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ.. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను 4, 6 కొట్టాడు. పాకిస్థాన్ టాప్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిదికే చుక్కలు చూపించాడు. తాజాగా పాకిస్థాన్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లోనూ షాహిన్ అఫ్రిది వేసిన తొలి ఓవర్ ఫస్ట్ బాల్ను అభిషేక్ సిక్సర్గా తరలించాడు.

అతను వేసిన మరుసటి ఓవర్లోనూ అభిషేక్ శర్మ మరో రెండు బౌండరీలు బాదాడు. అతని దెబ్బకు షాహిన్ షా అఫ్రిదికి పాక్ కెప్టెన్ మరో ఓవర్ కూడా ఇవ్వలేదు. అబ్రర్ అహ్మద్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 4, 6 సిక్స్ బాదిన అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్ల మైలురాయి అందుకున్నాడు. 331 బంతుల్లోనే అభిషేక్ శర్మ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. తద్వారా అత్యంత వేగంగా 50 సిక్స్లు బాదిన బ్యాటర్గా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు.
ఈ జాబితాలో అభిషేక్ శర్మ(331) తర్వాత ఎవిన్ లూయిస్(366), ఆండ్రీ రస్సెల్(409), హజ్రతుల్లా జజై(492), సూర్యకుమార్ యాదవ్(510) ఉన్నారు. అభిషేక్ శర్మ విధ్వంసంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. అబ్రర్ అహ్మద్ బౌలింగ్లో మరో రెండు సిక్స్లు బాదిన అభిషేక్ శర్మ 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్కు ఫిదా అయిన నెటిజన్లు.. 'ఏం గుండె భయ్యా నీది.. మళ్లీ ఫస్ట్ బాల్కే సిక్సా?'అని కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్లు వదిలేయడం పాకిస్థాన్కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది.
అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. అభిషే శర్మ హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ తీసారు.