టీ20 ప్రపంచకప్ 2024లో బ్లాక్ బస్టర్ సమరానికి రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే బిగ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్ ఒత్తిడిలో ఉండగా.. ఐర్లాండ్ను ఓడించి టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. అయినా ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని ఇరు దేశాల అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మాత్రం టీమిండియా ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందని జోస్యం చెప్పాడు.

భారత్ను ఓడించే సత్తా, సామర్థ్యం పాకిస్థాన్ జట్టుకు లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా.. ఈ ఆదివారం భారత్కు డబుల్ ధమాకా అని చెప్పాడు. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి ప్రమాణస్వీకారం చేస్తుంటే.. పాక్పై టీమిండియా మరో విజయాన్ని నమోదు చేయబోతుందన్నాడు.
'పాకిస్థాన్ ఆటగాళ్ల అహంకారం ఎప్పటికీ తగ్గదు. వారికి మ్యాచ్ గెలవాలనే సోయి ఏ మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులు, బంధు ప్రీతితో జట్టును ఎంపిక చేస్తారు. ఎవరూ కూడా దేశం గురించి ఆలోచించరు. ఆటగాళ్లకు అన్యాయం చేస్తే ఘోర పరాజయాలే ఎదురవుతాయి. తొలి మ్యాచ్లో పాకిస్థాన్కు ఎదురైన పరాజయమే పునరావృతమవుతోంది.
బాబర్ ఆజామ్ సెంచరీ చేయగానే అతన్ని అంతా విరాట్ కోహ్లీతో పోల్చుతారు. విరాట్ కోహ్లీ కాలి గోటికి కూడా బాబర్ ఆజామ్ సరితూగడు. అమెరికా బౌలర్లనే బాబర్ ఆజామ్ ఆడలేకపోయాడు. జిడ్డూ బ్యాటింగ్తో 40 పరుగులు చేసి కీలక సమయంలో ఔటయ్యాడు. బాబర్ ఆజామ్ కోహ్లీ కంటే గొప్ప బ్యాటర్ అయితే ఆ మ్యాచ్లో చివరి వరకు ఉండి గెలిపించాలి.
భారత్ చేతిలో పాకిస్థాన్కు ఘోర పరాజయం తప్పదు. టీమిండియా ఓడించే సామర్థ్యం పాకిస్థాన్కు ఏ మాత్రం లేదు. ప్రపంచకప్లో బరిలోకి దిగిన ప్రతీసారి తమ బౌలింగ్ విభాగం అహో ఓహో అంటూ గఫ్ఫాలు కొడుతూ ఉంటోంది. తమ బౌలింగ్ విభాగమే మ్యాచ్ను గెలిపిస్తుందని చెబుతుంది. కానీ ఆ బౌలింగ్ కారణంగానే పాకిస్థాన్ తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది.
పాకిస్థాన్ టీమ్ అంతా ఓ జోక్. ఎవరికి టీ20 ప్రపంచకప్ గెలవాలనే కసి లేదు. కుటుంబంతో కలిసి హాలీడే ట్రిప్కు వెళ్లినట్లు అమెరికాకు వచ్చారు.'అని కనేరియా ఘాటుగా వ్యాఖ్యానించాడు. కనేరియా కామెంట్స్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.