Vaibhav Suryavanshi: టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్ట్రాలు తగ్గించుకోని ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు. అండర్ 19 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ.. ఫీల్డింగ్ సందర్భంగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
పాకిస్థాన్ బ్యాటర్ అలీ హసన్ బలోచ్పైకి దూసుకెళ్లాడు. సహచర ఆటగాడు విహాన్ మల్హోత్ర అడ్డు కోవడంతో శాంతించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అభిమానులు వైభవ్ సూర్యవంశీని కొనియాడుతుంటే క్రికెట్ విశ్లేషకులు మాత్రం అతన్ని తప్పుబడుతున్నారు. కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు. ఆట కంటే ఎవరూ గొప్ప కాదని, 14 ఏళ్ల వయసు కలిగిన వైభవ్ సూర్యవంశీ మైదానంలో అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.
మైదానంలో అనవసర గొడవలు ఆటపై ఏకాగ్రత కోల్పోయేలా చేస్తాయని, అనవసర వివాదాలకు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు. పాక్ ఆటగాళ్లతో తరుచూ ఇలా గొడవపడితే సోషల్ మీడియాలో స్టార్ అవుతాడేమో కానీ ఆట ముందు జీరో అవుతాడని మందలిస్తున్నారు. కోచ్లు వైభవ్ సూర్యవంశీతో మాట్లాడాలని సూచిస్తున్నారు. అభిమానులు కూడా యంగ్ క్రికెటర్లు ఇలా చేస్తే సమర్థించవద్దని సూచిస్తున్నారు. ఇలా చేస్తే వారి భవిష్యత్తే అంధకారమవుతుందని హెచ్చరిస్తున్నారు.

పాకిస్థాన్ బ్యాటింగ్ సందర్భంగా విహాన్ మల్హోత్రా వేసిన 37వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయిన విహాన్ మల్హోత్రా పాకిస్థాన్ బ్యాటర్ అలీ హసన్ బలోచ్ వికెట్ తీసాడు. ఇది మ్యాచ్ను మలుపు తిప్పే వికెట్ కావడంతో భారత ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఏమైందో ఏమో కానీ వైభవ్ సూర్యవంశీలో కోపం కట్టలు తెంచుకుంది. పాక్ బ్యాటర్ అలీ హసన్తో అతను ఏదో అనడం వీడియోలో కనిపించింది.
ఆ తరువాత పాక్ బ్యాటర్వైపు కోపంగా దూసుకెళ్లబోయిన వైభవ్ను విహాన్ అడ్డుకొని శాంతపరిచాడు. అయితే పాక్ బ్యాటర్.. వైభవ్ను ఏమన్నాడనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. వైభవ్ నోట మాత్రం రాయలేని బూతు మాట స్టంప్ మైక్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు ధీటుగా బదులిచ్చాడు.
ఈ మ్యాచ్లో భారత్ 58 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటవ్వగా.. అనంతరం పాకిస్థాన్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
వేదాంత్ త్రివేది(98 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 68) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. ఖిలాన్ పటేల్(3/35), ఆయుష్ మాత్రే(3/21) మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో పాకిస్థాన్ ఇంటిబాట పట్టింది. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.