ఏసీసీ ఎమర్జింగ్ ఆసియాకప్ 2024 టీ20 టోర్నీలో భారత్-ఏ శుభారంభం చేసింది. దాయాదీ పాకిస్థాన్-ఏతో శనివారం జరిగిన తొలి మ్యాచ్లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్లో సమష్టిగా రాణించిన యంగ్ ఇండియా.. చిరస్మరణీయ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44), ప్రభ్సిమ్రాన్ సింగ్(19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 36), అభిషేక్ శర్మ(22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 35) రాణించారు. పాకిస్థాన్ -ఏ బౌలర్లలో మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అరఫత్ మిన్హాస్, కాసిమ్ అక్రమ్ తలో వికెట్ తీయగా.. సుఫియన్ ముఖీమ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓటమిపాలైంది. అరఫత్ మిన్హాస్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 41), యాసిర్ ఖాన్(22 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/33) మూడు వికెట్లు తీయగా.. రసిక్ సలామ్(2/30), నిషాంత్ సింధు(2/15) రెండేసి వికెట్లు తీసారు.
అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్ సుఫియన్ ముఖీమ్, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ షాట్లతో విరుచుకుపడిన అభిషేక్ శర్మను ఔట్ చేసిన ముఖీమ్.. ఆ ఆనందంలో బూతులు తిట్టాడు. బయటకు వెళ్లాలంటూ నోటికి పనిచెప్పాడు. పాక్ బౌలర్ నోటి దూలతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిషేక్ శర్మ ధీటుగా బదులిచ్చాడు. అతనిపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అంపైర్లు అడ్డుకున్నారు.
పవర్ ప్లేలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లను చెడుగుడు ఆడిన అభిషేక్ శర్మ.. స్పిన్నర్ ముఖీమ్ వేసిన ఏడో ఓవర్ తొలి బంతికే ఔటయ్యాడు. దాంతో అతను కాస్త ఎక్స్ట్రా చేయగా.. అభిషేక్ శర్మ ధీటుగా బదులిచ్చాడు. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
Dear Abhishek Sharma, these are not ipl bowlers.pic.twitter.com/MlrGP5ZV2k
— Maaz (@Im_MaazKhan) October 19, 2024