ఆసియా కప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. పాకిస్థాన్తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బౌలింగ్లో సత్తా చాటిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్లో చెలరేగి 25 బంతులు మిగిలు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మ అసాధారణ ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు చేసింది. షాహీన్ షా అఫ్రిది(16 బంతుల్లో 4 సిక్స్లతో 33 నాటౌట్) ఒక్కడే దూకుడుగా ఆడగా.. సాహిబ్జాదా ఫర్హాన్(44 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 40) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(3/18) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/18), జస్ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ చెరో వికెట్ తీసారు. భారత బౌలర్ల ధాటికి ఓ దశలో పాక్ 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ షాహిన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి పాక్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్), అభిషేక్ శర్మ(13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 31), తిలక్ వర్మ(31 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 31) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో సైమ్ అయుబ్(3/35) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. షాహిన్ షా అఫ్రిది వేసిన తొలి బంతినే బౌండరీకి తరలించిన అభిషేక్ శర్మ.. మరుసటి బంతిని భారీ సిక్సర్గా మలిచాడు. సైమ్ అయుబ్ వేసిన మరుసటి ఓవర్లో శుభ్మన్ గిల్(10) కూడా వరుసగా రెండు బౌండరీలు బాది జోరు కనబర్చాడు. కానీ అదే జోరులో అతను స్టంపౌట్గా వెనుదిరిగాడు. దాంతో 22 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శుభ్మన్ గిల్ ఔటైనా.. అభిషేక్ శర్మ తన దూకుడును కొనసాగించాడు. షాహిన్ అఫ్రిది రెండో ఓవర్లో ఓ ఫోర్, సిక్స్తో 11 పరుగులు పిండుకున్నాడు. సైమ్ అయుబ్ బౌలింగ్లోనూ వరుసగా రెండు బౌండరీలు బాదిన అభిషేక్ శర్మ.. మూడో బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. పిచ్ కండిషన్స్కు తగ్గట్లు స్లోగా ఆడిన ఈ జోడీ వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. తిలక్ వర్మ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను మొహమ్మద్ నవాజ్ నేలపాలు చేశాడు. కానీ ఆ మరుసటి ఓవర్లో తిలక్ వర్మను సైమ్ అయుబ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శివమ్ దూబే రాగా.. సూర్య క్విక్ సింగిల్స్, డబుల్స్తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమ్ అయుబ్ బౌలింగ్లో శివమ్ దూబే భారీ సిక్సర్ బాదగా.. సూర్య మరో భారీ సిక్సర్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.