IND vs PAK: యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. దశాబ్దాల వైరం.. కోట్లాది మంది భావోద్వేగానికి ప్రతిరూపమైన భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ సమరానికి సమయం ఆసన్నమైంది. బాయ్కాట్ డ్రామాకు పాక్ ప్రభుత్వం తెరదించడంతో కొలంబో వేదికగా ఆదివారం క్రికెట్ ప్రేమికులకు అసలైన విందు భోజనం అందనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా జైత్రయాత్రను కొనసాగించాలని చూస్తుంటే.. సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ జట్టు చరిత్రను తిరగ రాయాలనే పట్టుదలతో ఉంది.
స్పిన్కు అనుకూలించే కొలంబో పిచ్పై విజయం ఎవరిని వరిస్తుందో? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆసియా కప్ 2025 టోర్నీలో మూడుకు మూడు మ్యాచ్ల్లో పాక్ను మట్టికరిపించినా.. ఈసారి భారత్కు అంత ఈజీగా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్పిన్కు అనుకూలంగా ఉండే కండిషన్స్.. పాకిస్థాన్లో ఐదుగురు స్పిన్నర్లతో పాటు మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ ఉండటం ఆ జట్టుపై అంచనాలను పెంచుతోంది.
పాకిస్థాన్ను మట్టికరపించాలంటే ఆ జట్టుకు చెందిన ఓ ముగ్గురు ఆటగాళ్లపై భారత జట్టు ఫోకస్ పెట్టాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. వీడియో అనలిస్ట్లతో కలిసి గంభీర్ వ్యూహాలు రచించాలని సలహాలు ఇస్తున్నారు. భారత్ను అంతలా భయపెడుతున్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీక్ టాక్ ఆఫ్ ది వరల్డ్గా నిలిచాడు. విచిత్రకరమైన బౌలింగ్ యాక్షన్తో భారత అభిమానులను భయపెడుతున్నాడు. బంతిని విసిరే ముందు ఒక క్షణం పాటు ఆగి బ్యాటర్ కదిలికలను బట్టి ఆపై సైడ్ ఆర్మ్ యాక్షన్తో బంతిని వదులుతాడు. ఈ పాజ్ వల్ల బ్యాటర్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. బంతిని అంచనా వేయడం బ్యాటర్లకు కష్టంగా మారుతుంది. దాంతోనే అతని బౌలింగ్ను ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఉస్మాన్ తారిక్ బౌలింగ్పై టీమ్మేనేజ్మెంట్ ఫోకస్ పెట్టాలని, అతని వీడియోలను నిశితంగా పరిశీలించి బ్యాటర్లు స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగాలని సూచిస్తున్నారు.
నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ బౌలింగ్ శైలి కూడా కొంచెం ఉస్మాన్ తారీక్ తరహాలోనే ఉంటుంది. అతని బౌలింగ్లో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. నలుగురు బ్యాటర్లు అతని బౌలింగ్లోనే ఔటయ్యారు. ఈ క్రమంలోనే ఉస్మాన్ తారీక్ ఏం చేస్తాడో? అనే ఆందోళన భారత అభిమానుల్లో నెలకొంది. అయితే ఉస్మాన్ తారీక్ రిథమ్ను దెబ్బతీయడానికి టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మంచి చిట్కా చెప్పాడు. తారీక్ బౌలింగ్ చేసే ముందు ఆగిపోయినప్పుడు బ్యాటర్లు పక్కకు జరగాలని సూచించాడు. ఏది ఏమైనా ఉస్మాన్ తారీక్ బౌలింగ్ను చితక్కొట్టి అతని బలుపు తగ్గించాలని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ నుంచి కూడా భారత్కు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. బంతి ఆగుతూ వచ్చే శ్రీలంక పిచ్లపై అతని బౌలింగ్ ఆడటం బ్యాటర్లకు కష్టం.పైగా అబ్రార్ లెగ్ స్పిన్ తో పాటు గూగ్లీలను అద్భుతంగా వేయగలడు. ఇటీవల ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి అతను భీభత్సం సృష్టించాడు. ఈ వరల్డ్ కప్లో నెదర్లాండ్స్పై 2/23, యూఎస్ఏపై 1/30 వికెట్లతో మంచి ఫామ్లో ఉన్నాడు. మిడిల్ ఓవర్లలో భారత మిడిల్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టగల సత్తా అతనికి ఉంది. అతనికి వ్యతిరేకంగా భారత్ వ్యూహాలు రచించాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకుంటుంది.
పాకిస్థాన్ ప్రధాన బౌలింగ్ అస్త్రం షాహీన్ షా అఫ్రిది. జట్టులో కొనసాగుతున్న ఏకైక పేసర్ అతనే. కొలంబో పిచ్పై కొత్త బంతితో అతను స్వింగ్ చేయగలడు. డెత్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గతంలో షాహీన్ షా అఫ్రిది భారత్ను దెబ్బతీసాడు. అయితే అతని బౌలింగ్ను చితక్కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ పవర్ ప్లేలో అతని బౌలింగ్ను జాగ్రత్తగా ఎదుర్కోవాల్సిన అవసరం భారత్కు ఉంది. ఎందుకంటే అతను వికెట్లు తీస్తే భారత్ డిఫెన్స్లో పడే అవకాశం ఉంది. పాకిస్థాన్తో మ్యాచ్ అంటేనే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించి ఆడాలంటే మ్యాచ్ ఆరంభం నుంచే పైచేయి సాధించాలి.