టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్పై వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ విమర్శలు గుప్పించాడు. 10-12 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉండి కూడా వరుసగా విఫలమవ్వడం సంజూ శాంసన్కు అమోదయోగ్యం కాదన్నాడు. అవకాశాలు రాకపోతే రాలేదని బాధపడే సంజూ.. ఇస్తే ఆడటం లేదని అసహనం వ్యక్తం చేశాడు. ఒకటి, రెండు మ్యాచ్ల్లో విఫలమైతే పర్వాలేదని, కానీ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో రాణించకపోవడం సరికాదన్నాడు. సుదీర్ఘ అనుభవం ఉన్న సంజూ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నాడు.
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో 10, 6, 0, 24 సంజూ శాంసన్ దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో సత్తా చాటాడు. దాంతో సంజూ శాంసన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ జట్టులో సంజూ చోటు గల్లంతవ్వడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. తాజాగా సంజూ శాంసన్ వైఫల్యంపై మాట్లాడిన యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'సంజూ శాంసన్ చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. అతను ఐపీఎల్లో మిడిలార్డర్లో రాణించి.. ఓపెనర్గా ఎదిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10 నుంచి 12 ఏళ్లు అనుభవం ఉన్న సంజూ శాంసన్ వైఫల్యానికి ఒత్తిడే కారణమని చెప్పడం ఆమోదయోగ్యం కాదు.
న్యూజిలాండ్తో సిరీస్లో సంజూ శాంసన్కు వరుసగా నాలుగు మ్యాచ్ల్లో అవకాశాలు ఇచ్చారు. కానీ అతను నాలుగు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. ఒకటి, రెండు మ్యాచ్ల్లో రాణించకపోతే పర్వాలేదు కానీ.. వరుసగా మూడు, నాలుగు మ్యాచ్ల్లో విఫలమైతే జట్టుకు మంచిది కాదు. సంజూ శాంసన్ వెనుక ఇషాన్ కిషన్ వంటి గొప్ప ఆటగాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడనే విషయం అతనికి తెలుసు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. అతను ఎప్పుడైనా జట్టులోకి రావచ్చు.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. అయితే ఆఖరి టీ20 మ్యాచ్లో ఏం చేయాలనేది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. సంజూ శాంసన్ ఓపెనర్గా ఇబ్బంది పడుతున్నాడని మేనేజ్మెంట్ భావిస్తే ఇషాన్ కిషన్ను ఓపెనర్ కమ్ వికెట్ కీపర్గా ఆడించడం ఉత్తమం.'అని యుజ్వేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. తిరువనంతపురం వేదికగా జరిగే ఆఖరి టీ20లో సంజూ శాంసన్కు అవకాశం ఇస్తారా? లేక పక్కనపెడుతారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.