టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై 1000 ప్లస్ టెస్ట్ రన్స్ చేసిన మూడో భారత బ్యాటర్గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా యశస్వి జైస్వాల్(65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 77) ఈ ఫీట్ సాధించాడు.
సచిన్ కోహ్లీకి సాధ్యం కానీ రికార్డ్..
యశస్వి జైస్వాల్ కంటే ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఒకే క్యాలెండర్ ఇయర్లో సొంతగడ్డపై 1000 ప్లస్ రన్స్ చేశారు. 1979లో గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ మాత్రమే సొంతగడ్డపై 1000 ప్లస్ రన్స్ చేశారు. తాజాగా యశస్వి జైస్వాల్ ఈ జాబితాలో చేరాడు.

దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలకు కూడా ఈ రికార్డ్ సాధ్యం కాలేదు. ఓవరాల్గా ఇంగ్లండ్ ప్లేయర్ గ్రాహమ్ గూచ్(1990), ఆసీస్ బ్యాటర్ జస్టిన్ లాంగర్(2004), పాక్ బ్యాటర్ మహమ్మద్ యూసఫ్(2006) మాత్రమే సొంతగడ్డపై ఈ ఫీట్ సాధించారు.
రెండో బ్యాటర్గా..
ఇప్పటికే ఒక క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్గా యశస్వి జైస్వాల్ రికార్డ్ సాధించాడు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ రికార్డ్ను అధిగమించాడు. 23 ఏళ్ల వయసులో దిలీప్ వెంగ్సర్కార్ 1000 పరుగుల మార్క్ను అందుకోగా.. యశస్వి జైస్వాల్ 22 ఏళ్లకే ఈ ఫీట్ సాధించాడు.
ఈ ఏడాది టెస్ట్ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 10 మ్యాచ్లో 1053 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్ మాత్రం 14 మ్యాచ్ల్లో 1338 పరుగులతో టాప్లో కొనసాగుతున్నాడు.
30 సిక్స్లతో తొలి భారత బ్యాటర్గా..
టెస్ట్ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 30 సిక్స్లు బాదిన తొలి భారత బ్యాటర్గా కూడా యశస్వి జైస్వాల్ నిలిచాడు. యశస్వి జైస్వాల్ కంటే ముందు బ్రెండన్ మెక్కల్లమ్ 2014లో 30 ప్లస్ సిక్స్లు బాదాడు. యశస్వి జైస్వాల్ టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుపై కన్నేసాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఏకైక భారత ఓపెనర్గా సెహ్వాగ్ కొనసాగుతున్నాడు.
2008లో సెహ్వాగ్ ఓపెనర్గా 1462 పరుగులు చేశాడు. ఈ రికార్డ్ను యశస్వి జైస్వాల్ అధిగమించే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇంకా యశస్వి జైస్వాల్.. న్యూజిలాండ్తో మూడో టెస్ట్తో పాటు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్లు ఆడాల్సి ఉంది.