రెండు రోజులు ఎండలే..
అయితే బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు మాత్రం మంగళవారం, బుధవారం వర్షాలు లేవని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నామే వర్షం ఆగిపోయినప్పటికీ ఔట్ ఫీల్డ్ చిత్తడి కావడంతో ఆట సాధ్యం కాలేదు. అయితే నేడు (మంగళవారం), బుధవారం వర్షం పడే అవకాశమే లేదని సౌతాంప్టన్ వెదర్ ఫోర్ కాస్ట్ చూపిస్తుంది. పైగా ఎండలుకొడుతాయని కూడా సూచిస్తుంది. మంగళవారం 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా.. బుధవారం 21 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండు రోజుల పాటు సజావుగా సాగనుంది.
వర్షం పడితే డ్రా..
అయితే వాతావరణ శాఖకు భిన్నంగా వర్షం పడితే మాత్రం ప్రతిష్టాత్మక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగియనుంది. ఈ మ్యాచ్కు ఐసీసీ రిజ్వరేడేను కేటాయించడంతో మొత్తం ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. వర్షంతో ఒక్క సెషన్ రద్దయినా మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఫస్ట్ వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ టైటిల్ను ఇరు జట్లు షేర్ చేసుకోనున్నాయి. ఇక రిజర్వ్ డే ఆడించడంపై కూడా ఐదో రోజు ఆట చివరి గంటలో నిర్ణయం తీసుకోనున్నారు. ఫలితం తేలే అవకాశం ఉంటేనే రిజర్వ్ డేను ఉపయోగించుకోనున్నారు.
మెరుగ్గా న్యూజిలాండ్..
ఇప్పటి వరకు జరిగిన ఆటను పరిశీలిస్తే న్యూజిలాండ్దే పైచేయి కనిపిస్తోంది. సెకండ్ డే ఆటలో కివీస్పై భారత్ ఎడ్జ్ సాధించినా.. మూడో రోజు ఆటలో మాత్రం విఫలమైంది. కైల్ జేమీసన్ (5/31) నిప్పులు చెరగడంతో భారత్ బదులివ్వలేకపోయింది. 92.1 ఓవర్లలో 217 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి న్యూజిలాండ్కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తున్నప్పటికీ.. భారత్ విజయావకాశాలను కొట్టిపారేయేలేం. ఎందుకంటే పిచ్, అక్కడి వాతావరణం అలా ఉంది.
ఎండలు కాస్తే..
టీమిండియా సైతం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 156/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. పైగా క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే ఉన్నారు. కానీ మూడో రోజు ఫస్ట్ సెషన్ ఆటలో అంతా రివర్స్ అయింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచుకున్న కివీస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో 71 పరుగుల వ్యవధిలోనే భారత్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆటలో భారత బౌలర్ల కూడా ఇలానే చెలరేగితో కివీస్ కూడా స్వల్ప స్కోర్కే పరిమితం కావచ్చు. లీడ్ ఇవ్వకుండా భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 250+ స్కోర్ చేస్తే.. కివీస్కు కష్టాలు తప్పవు. ఎండలు కాస్తే కివీస్ ఓటమి ఖాయం. ఎందుకంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో స్పిన్నర్లు కీలకం అవుతారు. పైగా న్యూజిలాండ్ ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది.