టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్తో పుణె వేదికగా గురువారం ప్రారంభమైన రెండో టెస్ట్లో వాషింగ్టన్ సుందర్(7/59) ఏడు వికెట్లతో దుమ్మురేపాడు. అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించాడు.
తొలి టెస్ట్ పరాజయం అనంతరం అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సుందర్.. టీమ్మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. 45 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చిన సుందర్.. కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో అరుదైన రికార్డ్ను ఖాతాలో వేసుకున్నాడు.

పుణెలోని ఎంసీఏ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఓవరాల్గా రెండో బౌలర్గా నిలిచాడు. సుందర్ కంటే ముందు ఆస్ట్రేలియా బౌలర్ స్టీఫెన్ ఓ కీప్.. ఈ మైదానంలో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఈ మైదానంలో సుందర్దే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం.
టెస్ట్ల్లో న్యూజిలాండ్పై 7 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్గానూ సుందర్ రికార్డ్ సాధించాడు. సుందర్ కంటే ముందు వెంకట రాఘవన్- 8/72(1965), ఎరపల్లి ప్రసన్న-8/76(1975), రవిచంద్రన్ అశ్విన్-7/59(2017) న్యూజిలాండ్పై 7 ప్లస్ వికెట్ల ఘనతను అందుకున్నారు.
వాషింగ్టన్ సుందర్తో పాటు అశ్విన్(3/64) మూడు వికెట్లతో సత్తా చాటడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిచెల్ సాంట్నర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 33) పర్వాలేదనిపించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ .. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(0) డకౌటవ్వగా.. యశస్వి జైస్వాల్(6 బ్యాటింగ్), శుభ్మన్ గిల్(10 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ ఓ వికెట్ తీసాడు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.