న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్ ఆడుతున్న భారత జట్టులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్వల్ప మార్పు చేసింది. ఈ సిరీస్లో మిగిలిన రెండు టెస్ట్ల కోసం స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.
అక్టోబర్ 24 నుంచి పుణె వేదికగా రెండో రెండు టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలుస్తాడని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చివరి టెస్ట్ జరగనుంది.
బెంగళూరు వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయం నేపథ్యంలో బీసీసీఐ.. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు రిషభ్ పంత్, శుభ్మన్ గిల్ గాయాలతో బాధపడుతుండటంతో వారికి బ్యాకప్గా సుందర్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

వాషింగ్టన్ సుందర్ ఇప్పటి వరకు భారత్ తరఫున 4 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో 265 పరుగులు చేసిన సుందర్.. బౌలింగ్లో 6 వికెట్లు తీసాడు. ప్రస్తుతం సుందర్ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. తమిళనాడు తరఫున ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో సుందర్(269 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్తో 152) సెంచరీతో రాణించాడు.
ఈ మ్యాచ్లో ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు దిగి మరీ దుమ్మురేపాడు. దాంతో సుందర్ను సెలెక్టర్లు టీమిండియాకు ఎంపిక చేశారు. అప్కమింగ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్దం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2021లో సుందర్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.
న్యూజిలాండ్తో చివరి రెండు టెస్ట్లకు భారత జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్.