ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో న్యూజిలాండ్ 252 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(29 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 37), గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34)కీలక ఇన్నింగ్స్ ఆడారు.
టీమిండియా స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) సత్తా చాటినా.. పేసర్లు మహమ్మద్ షమీ(1/74), హార్దిక్ పాండ్యా(0/30) దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చారు. దాంతో న్యూజిలాండ్కు పోరాడే లక్ష్యం దక్కింది.

అదిరిపోయే ఆరంభం..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. దూకుడైన బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేశారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రచిన్ రవీంద్ర భారీ షాట్స్ ఆడాడు.అతను ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను మహమ్మద్ షమీ నేలపాలు చేశాడు. పేసర్లను సునాయసంగా ఆడుతున్న ఈ జోడీని విడదీసేందుకు రోహిత్ శర్మ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు.
మలుపు తిప్పిన వరుణ్, కుల్దీప్..
వరుణ్ చక్రవర్తీ వేసిన ఏడో ఓవర్లో రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ నేలపాలు చేశాడు. కానీ అదే ఓవర్లో విల్ యంగ్ను ఔట్ చేసి వరుణ్ చక్రవర్తీ.. తొలి వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. పవర్ ప్లే అనంతరం కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో డేంజరస్ రచిన్ రవీంద్రతో పాటు కేన్ విలియమ్సన్ను పెవిలియన్ చేర్చి కివీస్ను కోలుకోలేని దెబ్బతీసాడు.
మరోవైపు ఆచితూచి ఆడిన టామ్ లాథమ్ను జడేజా ఔట్ చేయగా.. గ్లేన్ ఫిలిప్స్తో కలిసి డారిల్ మిచెల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 91 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఫిలిప్స్ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేసి 6వ వికెట్కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
తేలిపోయిన షమీ, హార్దిక్..
మైకేల్ బ్రేస్వెల్తో కలిసి బౌండరీలతో జోరు కనబర్చిన డారిల్ మిచెల్ను షమీ క్యాచ్ ఔట్ చేశాడు. మిచెల్ సాంట్నర్తో కలిసి దూకుడుగా ఆడిన బ్రేస్వెల్ న్యూజిలాండ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మిచెల్ సాంట్నర్(8) రనౌటైనా.. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టు స్కోర్ను 250 ధాటించాడు. డెత్ ఓవర్లలో షమీ, హార్దిక్ ధారళంగా పరుగులిచ్చారు. దాంతో కివీస్ 250 పరుగులు చేయగలిగింది.