ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్ల్లో విజయం సాధించి గ్రూప్-ఏ టాపర్గా సగర్వంగా సెమీఫైనల్కు చేరింది. న్యూజిలాండ్తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మంగళవారం జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్(120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్..
లక్ష్యచేధనలో న్యూజిలాండ్కు శుభారంభం దక్కలేదు. ఆరంభంలోనే రచిన్ రవీంద్ర(6)ను అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్తో హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన కేన్ మామతో కలిసి విల్ యంగ్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దించి న్యూజిలాండ్ను దెబ్బతీసాడు. విల్ యంగ్(22)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ మరుసటి బంతికే డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ను కేఎల్ రాహుల్ వదిలేసాడు. దాంతో కేన్ విలియమ్సన్తో కలిసి అతను మూడో వికెట్కు 44 పరుగులు జోడించాడు.
తిప్పేసిన వరుణ్ చక్రవర్తీ
డారిల్ మిచెల్(17)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. టామ్ లాథమ్(14)ను జడేజా పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు కేన్ విలియమ్సన్ పరుగులు రాబట్టాడు. 77 బంతుల్లో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. గ్లేన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్లను వరుస ఓవర్లలో ఎల్బీగా వరుణ్ చక్రవర్తీ ఔట్ చేశాడు. మైకేల్ బ్రేస్వెల్ రివ్యూ తీసుకోకుండా మూల్యం చెల్లించుకున్నాడు. రిప్లేలో బంతి వికెట్లను మిస్సైనట్లు తేలింది.
సెంచరీ దిశగా సాగిన కేన్ మామను అక్షర్ పటేల్ కీపర్ క్యాచ్గా ఔట్ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మిచెల్ సాంట్నర్ పోరాడినా.. అతన్ని క్లీన్ బౌల్డ్ చేసిన వరుణ్ చక్రవర్తీ.. అదే ఓవర్లో మ్యాట్ హెన్రీ క్యాచ్ ఔట్ చేసి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. వన్డేల్లో వరుణ్ చక్రవర్తీకి ఇదే తొలి ఐదు వికెట్ల ఘనత. ఆఖరి వికెట్గా విల్ ఓరూర్కీని కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి భారత విజయలాంఛన్నా పూర్తి చేశాడు.