అక్లాండ్: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 80), శిఖర్ ధావన్(77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్మన్ గిల్(65 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా... చివర్లో వాషింగ్టన్ సుందర్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్ మూడేసి వికెట్లు తీయగా.. ఆడమ్ మిల్నే ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. టామ్ లాథమ్(104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్ర్లతో 145 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(98 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 94 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్ల వైఫల్యంతో గబ్బర్ సేన భారీ స్కోర్ను కాపాడుకోలేకపోయింది.
ఆరంభంలో ఉమ్రాన్ పేస్తో భయపెట్టినా.. టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ సాధికారిక ఇన్నింగ్స్తో న్యూజిలాండ్కు విజయాన్నందించారు. ఈ ఇద్దరూ 221 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఓ వైపు కేన్ మామ నెమ్మదిగా ఆడినా.. మరోవైపు టామ్ లాథమ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అక్లాండ్ మైదానంలో చిన్న బౌండరీలను టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఇక భారత బౌలర్లు లాంగ్ బౌండరీస్ వైపు ఆడేలా బౌలింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా అతను వేసిన 40వ ఓవర్లో టామ్ లాథమ్ 6,4, 4, 4, 4, 4 ఐదు బౌండరీలతో మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నాడు.ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం జరగనుంది.