మిచెల్ సాంట్నర్ అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించామని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అన్నాడు. భారత్తో పుణె వేదికగా జరిగిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్ 113 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్ట్ల సిరీస్ను 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత్ గడ్డపై తొలి సిరీస్ గెలిచింది. ఈ విజయంపై టామ్ లాథమ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఈ విజయం ప్రత్యేక అనుభూతినిస్తోంది. సిరీస్ గెలవడం చాలా గర్వంగా ఉంది. సమష్టి ప్రదర్శనతో ఈ విజయం సాధ్యమైంది. తొలి ఇన్నింగ్స్లో పరుగులు చేయడం కలిసొచ్చింది. మిచెల్ సాంట్నర్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

అతనో అద్భుతమైన స్పిన్నర్. అసాధారణ బౌలింగ్తో విజయాన్నందించాడు. ఈ విజయం క్రెడిట్ అతనిదే. మా బెసిక్స్కు కటుబడి ఆడాం. పిచ్ చాలా భిన్నంగా ఉంది. పరిస్థితులను అందుపుచ్చుకొని అందుకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేశాం. గ్లేన్ ఫిలిప్స్ విలువైన పరుగులు చేశాడు. టీమిండియా గట్టిగా పోరాడుతుందని అంచనా వేసాం. కానీ మేం కావాల్సిన బ్రేక్త్రూస్ అందుకున్నాం. చివరి రెండు వికెట్ల కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది. కానీ టీమ్ అద్భుతమైన క్యాచ్తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.'అని టామ్ లాథమ్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్ విధించిన 359 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 60.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(84 బంతుల్లో 2 ఫోర్లతో 42) పర్వాలేదనిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(6/104) ఆరు వికెట్లతో మరోసారి భారత్ పతనాన్ని శాసించాడు. ఆజామ్ పటేల్కు రెండు వికెట్లు దక్కగా.. గ్లేన్ ఫిలిప్స్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేయగా.. అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులు చేసింది.