
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో టీమిండియా పోరాటం దాదాపు ముగిసింది. న్యూజిలాండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు చెత్తాటతో మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్లో విఫలమైన కోహ్లీ సేన.. ఆ తర్వాత బౌలింగ్లోనూ నిరాశపరిచింది. దాంతో ఏక పక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్రత్యర్థి మారినా భారత జట్టు రాత మాత్రం మారలేదు. హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత్ రెండు మ్యాచ్ల్లో కనీస పోరాటం చేయలేకపోయింది. అద్భుతాలు జరిగితే తప్పా టీమిండియా టోర్నీలో ముందడుగేసే పరిస్థితి లేదు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్తో 23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇష్ సోదీ రెండు వికెట్లు తీశారు. టీమ్ సౌథీ, ఆడమ్ మిల్నే తలో వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి 33 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. డారిల్ మిచెల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), కేన్ విలియమ్సన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి.
111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(16), డారిల్ మిచెల్ నిదానంగా ఇన్నింగ్స్ను ప్రారంభించారు. మూడు బౌండరీలతో జోరు కనబర్చిన గప్టిల్ను బుమ్రా పెవిలియన్.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్తో మిచెల్ చెలరేగాడు. రవీంద్ర జడేజా వేసిన 6వ ఓవర్లో మిచెల్ ఓ సిక్స్, రెండు బౌండరీలు బాదాడు. దాంతో న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 44 రన్స్ చేసింది. ఆ తర్వాత షమీ బౌలింగ్లో సిక్స్ బాదిన మిచెల్.. తన జోరును కొనసాగించాడు.
ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన 10వ ఓవర్లో ఓ సిక్స్తో పాటు రెండు బౌండరీలు బాదాడు. దాంతో 10 ఓవరల్లోనే న్యూజిలాండ్ 83 పరుగులు చేసింది. ఆ తర్వాత కోహ్లీ.. బుమ్రా, హార్దిక్ను బౌలింగ్కు తెచ్చినా కేన్ మామ, మిచెల్ నిదానంగా ఆడారు. ఇక బుమ్రా వేసిన 13వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించిన డారిల్ మిచెల్ లాంగాన్లో కేఎల్ రాహుల్ చేతికి చిక్క హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అయితే కివీస్ చేధించాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో వికెట్ తీసినా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన డేవాన్ కాన్వేతో కలిసి కేన్ మామ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 14 ఓవర్లో రెండు బౌండరీలు బాదిన కేన్ మామ.. శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్లో సింగిల్స్తో మ్యాచ్ను ముగించాడు.