
దుబాయ్: ప్రత్యర్థి మారినా భారత్ తలరాత మాత్రం మారలేదు. అదే పిచ్పై కలిసిరాని పరిస్థితుల్లో పేలవ బ్యాటింగ్తో టీమిండియా మరోసారి దారుణంగా విఫలమైంది. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను చేజార్చుకొని స్వల్ప స్కోర్కే పరిమితమైంది. రవీంద్ర జడేజా(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 26 నాటౌట్) పోరాటంతో 100 పరుగుల మార్క్ను ధాటగలిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. జడేజా మినహా అంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఇష్ సోదీ రెండు వికెట్లు తీశారు. టీమ్ సౌథీ, ఆడమ్ మిల్నే తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపిస్తూ టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం మిస్ ఫైర్ అయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో బౌండరీతో జోరు కనబర్చిన ఇషాన్(4).. అదే ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వస్తూనే రోహిత్ శర్మ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద మిల్నే సునాయస క్యాచ్ను నేలపాలు చేశాడు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న న్యూజిలాండ్ బౌలర్లు.. భారత బ్యాట్స్మన్ను పూర్తిగా ఇబ్బంది పెట్టారు. అయితే మిల్నే వేసిన ఐదో ఓవర్లో రాహుల్ ఓ బౌండరీ బాదగా.. రోహిత్ 4, 6తో జోరు కనబర్చాడు.
దాంతో ఆ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సౌతీ వేసిన 6వ ఓవర్లో బౌండరీతో జోరు కనబర్చిన రాహుల్.. మరో భారీ షాట్కు ప్రయత్నించిన క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో భారత వికెట్ల పతనం మొదలైంది. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. భారత పరుగుల వేగం మందగించింది. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనైన రోహిత్ శర్మ(14) భారీ షాట్కు ప్రయత్నించి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన పంత్తో కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ కివీస్ కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ఈ జోడీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఈ క్రమంలోనే సోదీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన కోహ్లీ(9) లాంగాన్లో బౌల్ట్కు చిక్కి వెనుదిరిగాడు. హార్దిక్కు జత కలిసిన పంత్.. నిదానంగా ఆడే ప్రయత్నం చేశాడు. క్విక్ సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేసినా.. బౌండరీలు రాకపోవడంతో స్కోర్ బోర్డు మందగించింది. ఈ పరిస్థితుల్లోనే రిషభ్ పంత్ను మిల్నే బౌల్ట్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్, జడేజా సైతం ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హార్దిక్(23), శార్దూల్ ఠాకూర్(0) ఔటయ్యారు. ఇక చివరి ఓవర్లో జడేజా సిక్స్ కొట్టడంతో టీమిండియా 110 పరుగులైనా చేయగలిగింది.