
దుబాయ్: టీ20 ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మళ్లీ కోహ్లీసేన బ్యాటింగ్ చేయనుంది. గత పాకిస్థాన్ మ్యాచ్లో కూడా విరాట్ టాస్ ఓడిపోవడంతో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. మరీ తేమ ప్రభావం ఎక్కువ గల ఈ మైదానంలో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి. పిచ్, తేమ ప్రభావం నేపథ్యంలో ఫీల్డింగ్ ఎంచుకున్నానని కేన్ విలియమ్సన్ చెప్పాడు. జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, టీమ్ సీఫెర్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే జట్టులోకి వచ్చాడని చెప్పాడు. దాంతో డేవాన్ కాన్వే కీపింగ్ చేస్తాడని వెల్లడించాడు.
ఇక టాస్ ఓడిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తాము ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నామని, కానీ బ్యాట్స్మెన్ ధాటిగా ఆడి భారీ స్కోర్ సాధిస్తే బౌలర్లు పోరాడేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పాడు. ఈ మ్యాచ్కు చాలా గ్యాప్ వచ్చిందని, తమ టీమ్ రికవరీ అయ్యిందన్నాడు. ఇక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, వెన్ను గాయంతో బాధపడుతున్న సూర్య స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. ఇక భువనేశ్వర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్లాంటి సమరం ఇది. గెలిచిన జట్టు సెమీఫైనల్ చేరేందుకు చేరువయ్యే అవకాశం ఉండగా... ఓడితే మాత్రం పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోతుంది. తర్వాతి మ్యాచ్లలో ఫలితాలతో పాటు ఎన్నో సమీకరణాలు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. తర్వాతి మ్యాచ్ల్లో చిన్న జట్లతో ఆడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్లో ఫలితం ఎంతో కీలకం కానుంది. ఇలాంటి స్థితిలో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరం.
తుది జట్ల వివరాలు
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, పంత్, హార్దిక్, జడేజా, శార్దూల్ ఠాకూర్, షమీ, బుమ్రా, వరుణ్.
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, కాన్వే, నీషమ్, ఫిలిప్స్, డరైల్, డారిల్ మిచెల్, సాన్ట్నర్, సోధి, బౌల్ట్, మిల్నే.