ధర్మశాల: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్లో ఆడే అవకాశాన్ని అందుకున్న సూర్య(2)ను దురదృష్టం వెంటాడింది. హార్దిక్ పాండ్యా గాయంతో దూరమవ్వడంతో అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన సూర్య రనౌట్గా వెనుదిరిగాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోసం తన వికెట్ను త్యాగం చేశాడు. కేఎల్ రాహుల్(27) ఔటైన అనంతరం 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సూర్య.. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో వికెట్ పారేసుకున్నాడు. ట్రెంట్ బౌల్డ్ వేసిన 34 ఓవర్లో సూర్య.. కోహ్లీ కారణంగా రనౌటయ్యాడు. ఈ ఓవర్ ఐదో బంతిని సూర్య కవర్స్ దిశగా ఆడి సింగిల్కు ప్రయత్నించాడు.

షార్ట్ కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ సాంట్నర్ సూపర్ డైవ్తో బంతిని అడ్డుకున్నాడు. దాంతో సింగిల్కు మూమెంట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఆగిపోయాడు. అప్పటికే నాన్ స్ట్రైకర్ వైపు వచ్చిన సూర్య... యూటర్న్ తీసుకొని బ్యాటింగ్ ఎండ్వైపు పరుగెత్తే ప్రయత్నం చేశాడు. కానీ సాంట్నర్ ఇచ్చిన బంతిని అందుకున్న బౌల్ట్.. చాకచక్యంగా కీపర్ లాథమ్కు అందించి రనౌట్ చేశాడు.
విరాట్ కోహ్లీ ఆగకుండా పరుగెత్తి ఉంటే సూర్య ఔటయ్యేవాడు కాదు. నాన్స్ట్రైకర్ వైపు పరుగెత్తినా కోహ్లీనే ఔటయ్యేవాడు. కానీ అప్పటికే హాఫ్ సెంచరీతో క్రీజులో సెట్ అయిన విరాట్ కోహ్లీ కోసం సూర్య తన వికెట్ను త్యాగం చేశాడు. వికెట్ల మధ్య కోహ్లీ వేగంగా పరుగెత్తుతాడనే ధీమాతోనే సూర్య ఈ క్విక్ సింగిల్కు ప్రయత్నించాడు. కానీ కోహ్లీ ఆగిపోవడంతో మూల్యం చెల్లించుకున్నాడు. కోహ్లీ కారణంగా తన అరంగేట్ర ప్రపంచకప్లో సూర్య తీవ్రంగా నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 130), రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 75) రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(5/54) ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 71 పరుగులు జోడించిన అనంతరం రోహిత్, శుభ్మన్ గిల్ 5 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో ధాటిగా ఆడిన శ్రేయస్ అయ్యర్(33)ను ట్రెంట్ బౌల్ట్.. షార్ట్ పిచ్ బాల్తో బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 128 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.