అదిరిపోయే ఆరంభం..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ(34),శుభ్మన్ గిల్ శుభారంభం అందించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ తనదైన పుల్ షాట్లతో 2 భారీ సిక్స్లు బాదాడు.
మరోవైపు శుభ్మన్ గిల్ సైతం పరుగులు రాబట్టడంతో భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం బ్లెయిర్ టిక్నర్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కోహ్లీ, ఇషాన్, సూర్య విఫలమైనా..
ఆ తర్వాత ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ(8) మిచెల్ సాంట్నర్ స్టన్నింగ్ డెలివరీకి బౌల్డ్ అయ్యాడు. ఏ మాత్రం ఈ బంతిని అంచనా వేయలేకపోయిన విరాట్.. బ్యాక్ ఫూట్లో ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు. క్రీజులోకి ఇషాన్ కిషన్ రాగా.. శుభ్మన్ గిల్ సిక్సర్తో 53 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు.
అయితే ఆ కొద్ది సేపటికే ఇషాన్ కిషన్(5)ను ఫెర్గూసన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(31) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. నాలుగు బౌండరీలతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాడు. కానీ ఎక్కువ సేపు ఆడలేకపోయాడు. డారిల్ మిచెల్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
శతక్కొట్టిన శుభ్మన్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఓవైపు హార్దిక్ తడబడినా.. గిల్ చెలరేగాడు. ఈ క్రమంలోనే మిచెల్ సాంట్నర్ వేసిన 30వ ఓవర్ రెండో బంతిని సిక్స్గా మలిచి 99 పరుగులకు చేరుకున్న గిల్.. మరుసటి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన శుభ్మన్ గిల్ 150 పరుగుల మార్క్ను కూడా అందుకున్నాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. వికెట్ కీపర్ గ్లోవ్స్ తాకి బెయిల్స్ పడగా.. థర్డ్ అంపైర్ ఔటివ్వడం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఐదో వికెట్కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
హ్యాట్రిక్ సిక్స్లతో డబుల్ సెంచరీ..
చివర్లో వాషింగ్టన్ సుందర్(12), శార్దూల్ ఠాకూర్(3) ఔటైనా.. శుభ్మన్ గిల్ న్యూజిలాండ్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్లో తొలి మూడు బంతులను వరుసగా సిక్స్లుగా మలిచి 145 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో డబుల్ సెంచరీ బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. చివరి ఓవర్లో క్యాచ్ ఔటైనా.. టీమిండియా 349 పరుగుల భారీ స్కోర్ చేసింది.