టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కళ్లు చెదిరే ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో సూపర్ త్రోతో ఔరా అనిపించాడు. అతని సూపర్ ఫీల్డింగ్కు న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రెస్వెల్(16) రనౌట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఈ వికెట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అయ్యర్పై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తుంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన 43వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని డారిల్ మిచెల్ లాంగాన్ దిశగా ఆడి క్విక్ డబుల్కు ప్రయత్నించాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ వేగంగా ముందుకు పరుగెత్తుకొచ్చి బంతిని అందుకొని నాన్స్ట్రైకర్ వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. ఈ త్రోకు బిత్తరపోయిన మైఖేల్ బ్రెస్వెల్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ రనౌట్తో 6వ వికెట్కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగుల భారీ స్కోర్ చేసింది. డారిల్ మిచెల్(71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 84), డెవాన్ కాన్వే(67 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 56), హెన్రీ నికోల్స్(69 బంతుల్లో 8 ఫోర్లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/40), హర్షిత్ రాణా(2/65), ప్రసిధ్ కృష్ణ(2/60) రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 117 పరుగులు జోడించారు. ఈ ఇద్దర్నీ హర్షిత్ రాణా ఔట్ చేయగా.. విల్ యంగ్(12)ను మహమ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. గ్లేన్ ఫిలిప్స్(12)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. మిచెల్ హే(18)ను ప్రసిధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. జాక్ ఫోల్కర్స్(1)ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. క్రిస్టియన్ క్లార్క్ సాయంతో డారిల్ మిచెల్ చెలరేగాడు. సెంచరీ దిశగా సాగిన అతన్ని ప్రసిధ్ కృష్ణ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. కైల్ జెమీస్ సాయంతో క్రిస్టియన్ క్లార్క్(24) జట్టు స్కోర్ను 300 పరుగులకు చేర్చాడు.