గాయంతో దూరమైన టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆయుష్ బదోనిని ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేం సెలెక్షన్ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. బౌలింగ్ ఆల్రౌండర్ స్థానంలో పార్ట్ టైమ్ బౌలర్ను ఎలా ఎంపిక చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు నచ్చిన ఆటగాళ్లకే అవకాశాలు ఇస్తారా? అని నిలదీస్తున్నారు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైడ్ స్ట్రెయిన్ గాయానికి గురైన సంగతి తెలిసిందే. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సుందర్.. తదుపరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆయుష్ బదోనిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఈ సెలెక్షన్పై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుందర్ స్థానంలో షెహ్బాజ్ అహ్మద్కు అవకాశం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు పార్ట్ టైమ్ బౌలర్ అయిన బదోనిని జట్టులోకి తీసుకుంది. బదోని ఫామ్లో కూడా లేడు. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున అతను 4 మ్యాచ్లు ఆడి 16 పరుగులే చేశాడు. బౌలింగ్లో 4 వికెట్లు మాత్రమే తీసాడు.

గంభీర్ సూచనలతోనే బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారనే ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. గతంలో బదోనిని గంభీరే ఐపీఎల్కు పరిచయం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా ఉన్న సమయంలో ఈ ఢిల్లీ ఆటగాడిని వేలంలో కొనుగోలు చేయడంతో పాటు తుది జట్టులో ఆడించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో బదోని 11 మ్యాచ్ల్లో 148.19 స్ట్రైక్రేట్తో 329 పరుగులు చేశాడు. అయితే రంజీ ట్రోఫీ ఐదు ఇన్నింగ్స్లో మూడు హాఫ్ సెంచరీలతో 218 పరుగులు చేసిన బదోని బౌలింగ్లో ఏడు వికెట్లు తీసాడు. దులీప్ ట్రోఫీలో 153.50 సగటుతో 307 పరుగులు చేశాడు.
గంభీర్ ఆటగాళ్లతో మ్యూజికల్ చైర్ ఆడుతున్నాడని, టీమ్ సెలెక్షన్లో ప్రభావం చూపుతున్నాడని చెప్పేందుకు బదోని ఎంపికనే నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రిషభ్ పంత్ కోసం రుతురాజ్ గైక్వాడ్ను పక్కనపెట్టిన గంభీర్.. ఇప్పుడు సుందర్ స్థానంలో బదోనిని తీసుకొని షెహ్బాజ్ అహ్మద్కు తీరని అన్యాయం చేశాడని మండిపడుతున్నారు.