టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో విరోచిత శతకంతో టీమిండియాను ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం దిశగా సాగిన భారత్కు సర్ఫరాజ్ ఖాన్ అద్భుత శతకం పోరాడే లక్ష్యాన్ని అందించాడు.
రెండో ఇన్నింగ్స్లో 150 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. రిషభ్ పంత్తో నాలుగో వికెట్కు 178 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించాడు. శుభ్మన్ గిల్ మెడ నొప్పితో దూరమవడంతో చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. సంచలన బ్యాటింగ్తో ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.

సెంచరీ నా కల..
తనకే సాధ్యమైన అప్పర్ కట్స్తో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రిషభ్ పంత్తో 295 నిమిషాల పాటు క్రీజులో నిలిచి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఆలస్యంగా ఆడుతూ కట్, ర్యాంప్, స్వీప్ షాట్లతో సర్ఫరాజ్ చెలరేగుతున్నాడు. అయితే టీమిండియా తరఫున శతకం సాధించడం తన కలని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
నాలుగో రోజు ఆట అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన సర్ఫరాజ్ ఖాన్ తన తండ్రి ఎంతో స్పూర్తిని నింపాడని చెప్పుకొచ్చాడు. ఇక విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహా.. రిషభ్ పంత్ సహాకారం తన శతకాన్ని ఉపయోగపడ్డాయని తెలిపాడు.

నాన్న ఎప్పుడూ..
'నాన్న ఎప్పుడూ నాకు మోటీవేషన్ ఇస్తూ ఉంటాడు. టీమిండియా తరఫున తొలి సెంచరీ చేయడం సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇది నా కల. భవిష్యత్లో ఏం జరుగుతుందో చెప్పలేం. గతంలో భవిష్యత్తు గురించి ఆలోచించి చాలా సమయాన్ని వృథా చేసుకున్నా. అందుకే గతం, భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసాను. ప్రస్తుత కాలంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.
బౌన్స్ అయ్యే బంతులను ఆడటం నాకు ఇష్టం. ఇంటి దగ్గర ఉన్న బౌన్సీ వికెట్పై నిరంతరం సాధన చేస్తా. అందుకే సులువుగా బౌన్సర్లను కట్ చేయగలిగా. ఈ పిచ్పై బ్యాటింగ్ అంత సులువు కాదు. నేను రిషభ్ పంత్ దూకుడుగా ఆడుతాం. ఇన్నింగ్స్ మధ్య ఒకరికొకరం మాట్లాడుకుంటూ ముందుకు సాగాం.
కోహ్లీ సలహాతో..
నేను చిన్నప్పటి నుంచి కోహ్లీ ఆటను చూస్తూ పెరిగాను. అతనితో ఆడటం నా డ్రీమ్. ఆర్సీబీ తరఫున అది నెరవేరింది. కానీ భారత్ జట్టు తరఫున కోహ్లీతో క్రీజు షేర్ చేసుకోవడం ప్రత్యేకం. కోహ్లీతో బ్యాటింగ్ చేస్తున్నంత సేపు అతను నాకు అండగా నిలిచాడు. 'నీ షాట్స్ను స్వేచ్చగా ఆడు'అని చెప్పాడు. ఆ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కోహ్లీ, రోహిత్ వంటి ఆటగాళ్ల.. నువ్వు బాగా ఆడుతున్నావని వెన్ను తట్టితే గర్వంగా అనిపిస్తోంది.
ఈ మ్యాచ్ మా నుంచి చేజారిందని అనుకోవడం లేదు. బంతి తిరుగుతోంది. చివరి రోజు మూడు వికెట్లను త్వరగా పడగొడితే కివీస్ కూడా కుప్పకూలే అవకాశం ఉంది.'అని సర్ఫరాజ్ ఖాన్ చెప్పుకొచ్చాడు.