న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో టీమిండియా పోరాడుతోంది. 356 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 49 ఓవర్లలో 3 వికెట్లకు 231 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(63 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 52), స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(102 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 70), సర్ఫరాజ్ ఖాన్(78 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 70 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
సెంచరీ దిశగా సాగిన విరాట్ కోహ్లీ.. మూడో రోజు ఆటలోని చివరి బంతికి కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ ఫిలిప్స్ ఓ వికెట్ పడగొట్టాడు. టీమిండియా ఇంకా 125 పరుగుల వెనుకంజలో ఉంది.

న్యూజిలాండ్ 402
అంతకుముందు 180/3 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. రచిన్ రవీంద్ర(157 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్లతో 134) సెంచరీతో సత్తా చాటగా.. టీమ్ సౌథీ(73 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 137 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దాంతో న్యూజిలాండ్కు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రోహిత్ హాఫ్ సెంచరీ..
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఓపెనర్లు రోహిత్, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించారు. దూకుడుగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. తొలి వికెట్కు 72 పరుగులు జోడించిన అనంతరం అనవసర షాట్కు ప్రయత్నించి యశస్వి జైస్వాల్(35) స్టంపౌటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లీ రాగా.. రోహిత్ శర్మ తనదైన శైలిలో చెలరేగాడు. వరుసగా 4, 6, 4 బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ మరుసటి ఓవర్లోనే దురదృష్టవశాత్తు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కోహ్లీ, సర్ఫరాజ్ సూపర్ బ్యాటింగ్..
ఈ పరిస్థితుల్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. కోహ్లీ ఆచితూచి ఆడినా.. సర్ఫరాజ్ ఖాన్ అటాకింగ్ గేమ్ ఆడాడు. కోహ్లీ కూడా బౌండరీలతో విరుచుకుపడటంతో టీమిండిమా 41 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్ను ధాటింది. 42 బంతుల్లోనే సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. 70 బంతుల్లో విరాట్ కోహ్లీ అర్థశతకం సాధించాడు.
అనంతరం అదే జోరు కొనసాగించిన ఈ ఇద్దరూ సెంచరీల దిశగా ముందుకు సాగారు. కానీ గ్లేన్ ఫిలిప్స్ విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించి మూడో వికెట్కు నమోదైన 136 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించాలన్నా.. ఓటమి నుంచి గట్టెక్కాలన్నా.. నాలుగో రోజు మొత్తం బ్యాటింగ్ చేయాలి. కనీసం 200 ప్లస్ టార్గెట్ నమోదు చేస్తేనే చివరి రోజు స్పిన్నర్లతో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది.