టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా దారుణ వైఫల్యానికి రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీనే ప్రధాన కారణమని మండిపడుతున్నారు. ప్రత్యర్థి సారథి టామ్ లాథమ్ను చూసైనా కెప్టెన్సీ నేర్చుకోవాలని చురకలంటిస్తున్నారు.
తుది జట్టు ఎంపికలో కూడా రోహిత్ శర్మ తప్పు చేశాడని, పేస్కు ఏ మాత్రం అనుకూలంగా లేని వికెట్పై రెండో పేసర్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఆకాశ్ దీప్కు బదులు ఎక్స్ట్రా స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్ను ఆడించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు.

రోహిత్ శర్మ ఫీల్డ్ సెటప్ కూడా ఏమాత్రం బాలేదని, స్పిన్నర్లకు అనుకూలంగా ఫీల్డ్ సెటప్ చేయడం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ సైతం ఫస్ట్ ఇన్నింగ్స్ సందర్భంగానే రోహిత్ శర్మ ఫీల్డ్ సెటప్ను తప్పుబట్టాడు. రోహిత్ శర్మ డిఫెన్సివ్ కెప్టెన్సీ చేస్తున్నాడని మండిపడ్డాడు.
ప్రత్యర్థి దూకుడుగా ఆడకముందే లాంగాన్, లాంగాఫ్లో ఫీల్డర్లను మోహరించడమేంటని ప్రశ్నించాడు. ఇది డిఫెన్సివ్ కెప్టెన్సీ అని, రోహిత్ నెగటివ్ కెప్టెన్ అని విమర్శించాడు. రోహిత్ శర్మ చెత్త ఫీల్డ్ సెటప్ వల్ల న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 259 పరుగులు చేసింది. అయినా రోహిత్ శర్మ తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు.
రెండో ఇన్నింగ్స్లోనూ అదే తరహా ఫీల్డ్ సెటప్తో జట్టుకు తీరని నష్టం చేశాడు. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం భారత బ్యాటర్ల చుట్టూ ఫీల్డ్ సెటప్ పెట్టి ఒత్తిడిని పెంచి ఫలితాన్ని రాబట్టింది. ఇరు జట్ల ఫీల్డ్ సెటప్కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లు రోహిత్ శర్మ కెప్టెన్సీని తప్పుబడుతున్నారు.
16/1 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. 103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. కెప్టెన్ టామ్ లాథమ్(82 బ్యాటింగ్) సెంచరీ దిశగా సాగుతుండగా.. కివీస్ ఆధిక్యం 286 పరుగులు ధాటింది.