
నాగ్పూర్: ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ను ఉద్దేశించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. టీమిండియా బ్యాటింగ్ సమయంలో రెండో పరుగుకు ప్రయత్నించిన రవీంద్ర జడేజాతో రోహిత్ అన్న మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి.
మార్నస్ లబుషేన్ వేసిన 76వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్లో జడేజా స్లిప్లోకి బంతిని ఆడి క్విక్ సింగిల్ తీసాడు.
బంతిని స్మిత్ నిదానంగా అందుకోవడం చూసిన జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ.. స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం.. 'ఓ థోడా పాగల్ హై. సచ్ మే' అంటూ స్మిత్ను ఉద్దేశించి.. రెండో రన్ కోసం రావద్దంటూ జడేజాను వారించాడు. బాల్ను నిదానంగా తీసుకుంటున్నట్లు నటించి, వేగంగా త్రో వేయడం కోసం స్మిత్ వేసిన ప్లాన్ అని, ఇలాంటి పిచ్చి వేశాలు అతని దగ్గర చాలా ఉన్నాయనే ఉద్దేశంతో రోహిత్ అలా అన్నట్లు క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్ అన్న మాటల స్టంప్స్ మైక్లో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్లతో 120) సెంచరీతో చెలరేగగా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా(170 బంతుల్లో 9 ఫోర్లతో 66 బ్యాటింగ్), అక్షర్ పటేల్(102 బంతుల్లో 8 ఫోర్లతో 52 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 114 ఓవర్లలో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ముర్ఫీ(5/82) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. నాథన్ లియోన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ 144 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మరో 50 పరుగుల ఆధిక్యం అందుకుంటే దాదాపు ఈ మ్యాచ్ భారత్ వశమైనట్లే.
టెస్ట్ల్లో 9వ సెంచరీ బాదిన రోహిత్.. ఓవరాల్గా 43వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్గా తొలి సెంచరీ బాదిన రోహిత్.. మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా శతకం బాదిన తొలి భారత ప్లేయర్గా నిలిచాడు. ప్లేయర్గా కెప్టెన్గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు. ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు బాదిన ఓపెనర్గా సచిన్(9) సరసన నిలిచాడు.