అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ల అద్భుత భాగస్వామ్యంతోనే విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కీలకమైన దశలో ఈ ఇద్దరూ అసాధారణ పార్ట్నర్షిప్తో పోరాడే లక్ష్యాన్ని అందించారని కొనియాడాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ పోరాడే లక్ష్యాన్ని అందిస్తే.. బౌలర్లు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపాడు.
ఆ భాగస్వామ్యం అద్భుతం..
'ఈ మ్యాచ్ గెలిచి గ్రూప్-ఏ టాపర్గా నిలవడం మాకు చాలా ముఖ్యం. న్యూజిలాండ్ అద్భుతమైన జట్టు. ఇటీవల కాలంలో ఆ టీమ్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత అక్షర్ పటేల్-శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన భాగస్వామ్యంతో పోరాడే లక్ష్యాన్ని అందించారు. మాకు క్వాలిటీ బౌలర్లు ఉండటంతో ఆ లక్ష్యాన్ని కాపాడుకోగలమనే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. వరుణ్ చక్రవర్తీ భిన్నమైన బౌలర్. అతను ఏం చేయగలడనే ఉద్దేశంతోనే ఈ రోజు అతన్ని ఆడించాం. అయితే అతని అద్భుత ప్రదర్శనతో టీమ్ కాంబినేషన్ తలనొప్పిగా మారింది. తదుపరి మ్యాచ్కు ఏం చేయాలో మేం ఆలోచించాలి.

ఆ మ్యాచ్కు రెడీ..
వరుణ్ చక్రవర్తీ బంతులను అంచనా వేయడం చాలా కష్టం. పరిమిత ఓవర్ల క్రికెట్లో మూమెంటమ్ చాలా కీలకం. అందుకే గెలుపు కోసమే ప్రయత్నించాం. తప్పిదాలు జరగడం సహజం. కానీ వాటిని వీలైనంత త్వరగా సరిదిద్దుకోవడం ముఖ్యం. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మంచి గేమ్ కానుంది. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్కు మంచి రికార్డ్ ఉంది. మేం పరిస్థితులను మాకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాం. ఆ రోజు ఏం చేయాలనేదానిపై మాత్రమే ఫోకస్ పెడుతాం. ఈ మ్యాచ్ కోసం మేం ఉత్సాహంగా ఉన్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మలుపు తిప్పిన వరుణ్ చక్రవర్తీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో 45.3 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్(120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.