ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఆరంభంలోనే భారత్పై ఒత్తిడి పెట్టాలనుకుంటున్నాం. ఆ తర్వాత పిచ్ స్కిడ్ అవుతుందని భావిస్తున్నాం. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనుకుంటున్నాం. మేం లాహోర్లో సెమీస్ ఆడుతామనే విషయం తెలుసు. కానీ మా బాధ్యతను మేం నిర్వర్తించాలి. డెవాన్ కాన్వే ఈ మ్యాచ్కు దూరం కాగా.. డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు.'అని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.
మరోవైపు టీమిండియా వరుసగా 13వ వన్డేలోనూ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచినా తాము బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. 'మేం ఈ మ్యాచ్లో ముందుగానే బ్యాటింగ్ చేయాలనుకున్నాం. టాస్ ఓడినా మేం కోరుకున్నదే జరిగింది. గత రెండు మ్యాచ్ల్లో చేజింగ్ చేసిన మేం ఈ మ్యాచ్లో మమ్మల్ని మేం పరీక్షించుకోవాలనుకుంటున్నాం. గత రెండు మ్యాచ్ల తరహాలోనే మా అప్రోచ్ ఉంటుంది. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం.

హర్షిత్ రాణాకు రెస్ట్ ఇచ్చి వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకున్నాం. గత రెండు మ్యాచ్ల్లో మేం 19 వికెట్లు పడగొట్టాం. మా స్పిన్నర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఆ తర్వాత పేసర్లు వికెట్లు సాధించారు. బౌలింగ్లో సమష్టిగా రాణించడంతోనే విజయాలు దక్కాయి. ఈ క్రమంలోనే స్పిన్ బలాన్ని పెంచేందుకు వరుణ్ చక్రవర్తీని జట్టులోకి తీసుకున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. వరుణ్ చక్రవర్తీ రాకతో టీమిండియా ఈ మ్యాచ్లో నలుగురు స్పిన్నర్లతో ఆడుతోంది.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తీ
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లేన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జెమీసన్, మ్యాట్ హెన్రీ, విల్ రూర్కీ.