ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ జట్టు కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ చూడటానికి బాగుంది. వారం క్రితం భారత్తో ఇక్కడ ఆడిన మ్యాచ్ తరహాలోనే ఈ పిచ్ ఉండనుంది. భారీ లక్ష్యాన్ని నమోదు చేసి ఒత్తిడి పెట్టాలనుకుంటున్నాం. స్టేడియం మొత్తం భారత అభిమానులతో నిండిపోతుందని ముందే ఊహించాం. కిక్కిరిసిన స్టేడియంలో ఆడటం గొప్ప అనుభూతినిస్తోంది.
పాకిస్థాన్ పిచ్లకు ఇక్కడి వికెట్కు కాస్త తేడా ఉంది. ఇక్కడ భారత్ ఏం చేసిందో గమనించాం. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదించనుంది. విభిన్నమైన సమయాల్లో విభిన్న ఆటగాళ్లు బాధ్యత తీసుకున్నారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలి. దురదృష్టవశాత్తు మ్యాట్ హెన్రీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో నాథన్ స్మిత్ను జట్టులోకి తీసుకున్నాం.'అని మిచెల్ సాంట్నర్ తెలిపాడు.

మరోవైపు రోహిత్ శర్మ వరుసగా 15వ మ్యాచ్లోనూ టాస్ ఓడిపోయాడు. 'ఇక్కడి పరిస్థితులకు మేం అలవాటు పడ్డాం. ఇక్కడ ఇప్పటికే మేం ముందుగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా చేశాం. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేయడం వల్ల వచ్చే మార్పు ఏం లేదు. ఇప్పటికే మేం ఇక్కడ ఛేజింగ్లో విజయాలు సాధించాం. ఇది మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. టాస్ ప్రభావం లేకుండా అయ్యింది. ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే వారినే విజయం వరిస్తుంది. డ్రెస్సింగ్ రూమ్లో కూడా నేను ఇదే చెప్పాను.
టాస్ గురించి పట్టించుకోవద్దని, మీ ఆట మీరు ఆడాలని సూచించాను. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మేం ఇలానే రాణించాం. ఈ మ్యాచ్లోనూ అదే ప్రదర్శనను కొనసాగిస్తాం. న్యూజిలాండ్ చాలా మంచి జట్టు. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన చేస్తోంది. మెరుగైన ప్రదర్శన చేయాలనే సవాల్ విసురుతోంది. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్తోనే బరిలోకి దిగుతున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
కుల్దీప్ యాదవ్ను తప్పించి వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాల్లో ఒకరిని ఆడిస్తారని ప్రచారం జరిగినా.. టీమిండియా మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించింది. దాంతో రిషభ్ పంత్, సుందర్, అర్ష్దీప్ సింగ్లకు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కైల్ జామిసన్, విల్ ఓ'రూర్కే, నాథన్ స్మిత్.