న్యూజిలాండ్తో మిగిలిన రెండు టెస్ట్లకు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్లో రిషభ్ పంత్.. కీపింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. మోకాలికి సర్జరీ అయిన చోటే బంతి బలంగా తాకడంతో పంత్ నొప్పితో విలవిలలాడాడు. అతి కష్టంగా మైదానం వీడాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.
అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగిన రిషభ్ పంత్.. అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 99 పరుగుల వద్ద ఔటై తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. బ్యాటింగ్ సందర్భంగా భారీ షాట్స్ ఆడటంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టిన పంత్.. పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డాడు.

రిషభ్ పంత్ దూరం..
ఈ క్రమంలోనే అతను చివరి రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. తొలి టెస్ట్ అనంతరం రోహిత్ శర్మ.. రిషభ్ పంత్ గాయంపై స్పందించాడు. అతన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం టీమిండియాకు ఉందని చెప్పాడు. పరోక్షంగా అతను పూర్తిగా కోలుకునేవరకు ఆటకు దూరంగా ఉంటాడని చెప్పాడు.
'రెండేళ్ల క్రితం రిషభ్ పంత్కు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని మోకాలికి పెద్ద శస్త్ర చికిత్స జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను అసౌకర్యంగా కనిపించాడు. వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడ్డాడు.
మరింత జాగ్రత్తగా చూసుకోవాలి..
బంతిని బౌండరీ తరలించేందుకే ప్రయత్నించాడు. రిషభ్ పంత్ మాకు కీలక ఆటగాడు. అతని పట్ల మేము మరింత జాగ్రత్తగా ఉండాలి. కష్టాల్లో ఉన్నప్పుడు అతను జట్టును ఆదుకున్నట్టుగా.. మేము కూడా అతనిపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. కీపింగ్ చేయడం అంత సులువైన పనికాదు. సర్జరీ జరిగిన చోటే బంతి మళ్లీ తగలడంతో మోకాలు వాపు వచ్చింది.
తగినంత విశ్రాంతి అవసరమని అతన్ని నాలుగో ఇన్నింగ్స్లో మైదానంలోకి తీసుకురాలేదు. అప్కమింగ్ మ్యాచ్లకు అతను 100 శాతం ఫిట్గా ఉండాలనుకుంటున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
పూర్తి స్వేచ్ఛనిచ్చాం..
రిషభ్ పంత్ అటాకింగ్ గేమ్ గురించి మాట్లాడుతూ.. 'పంత్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనతో బరిలోకి దిగాడో తెలియదు. తనకు నచ్చినట్లు ఆడేలా మేం పూర్తి స్వేచ్చనిచ్చాం. ఎందుకంటే అతను ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడాడు. అతని మనస్తత్వం గురించి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా అతనితో మాట్లాడాల్సిన పని లేదు.
పరిస్థితులను బట్టి ఆడే సామర్థ్యం అతనిలో ఉంది. అలాంటి ఆటతీరే మాకు కూడా కావాల్సింది. కాబట్టి అతన్ని స్వేఛ్చగా ఆడనివ్వాలనుకున్నాం'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. రెండో టెస్ట్ అక్టోబర్ 24 నుంచి పుణే వేదికగా ప్రారంభం కానుంది.