స్పిన్నర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలిచామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ముచ్చటగా మూడో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. కెప్టెన్గా రోహిత్ శర్మ వరుసగా రెండో ఐసీసీ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.
స్పిన్నర్లదే క్రెడిట్..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. మైదానానికి వచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 'మాకు మద్దతు తెలిపేందుకు మైదానానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని నేను అభినందించాలనుకుంటున్నా. ఈ మ్యాచ్కు భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం అద్భుతం. ఇదేం మా హోమ్ గ్రౌండ్ కాదు. కానీ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై హోమ్ గ్రౌండ్లా మార్చారు. భారీ సంఖ్యలో మా ఆటను చూసేందుకు ప్రేక్షకులు రావడం.. వారంతా సంతోషించేలా ఫలితం దక్కడం సంతృప్తినిచ్చింది.

ఈ ఒక్క మ్యాచే కాదు.. ఈ టోర్నీ ఆసాంతం మా స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈ తరహా పిచ్పై ఆడుతున్నప్పుడు స్పిన్నర్లపై భారీ అంచనాలు ఉంటాయి. కానీ మా స్పిన్నర్లు ఏ మాత్రం నిరాశపర్చలేదు. ఈ తరహా పిచ్లపై మా స్పిన్నర్ల బలాలను అర్థం చేసుకొని అడ్వాంటేజ్గా వాడుకున్నాం. ఈ టోర్నీ ఆసాంతం మేం నిలకడగా బౌలింగ్ చేశాం.
రాహుల్ క్లాస్ సూపర్..
కేఎల్ రాహుల్ మానసికంగా దృడమైన వ్యక్తి. ఒత్తిడిని ఏ మాత్రం దరిచేరనివ్వడు. అందుకే అతన్ని మేం మిడిలార్డర్లో ఆడించాం. ప్రశాంతంగా ఉంటై సరైన షాట్స్ మాత్రమే ఆడుతాడు. అంతేకాకుండా సహచర ఆటగాళ్లు స్వేచ్చగా ఆడేలా అండగా నిలుస్తాడు. ఉదాహారణకు హార్దిక్ పాండ్యా ఆడిన భారీ షాట్లే. రాహులే కాదు ఈ టోర్నీలో మా బ్యాటర్లంతా అద్భుత ప్రదర్శన కనర్చారు. వరుణ్ చక్రవర్తీలో ఏదో వైవిధ్యం ఉంది. ఈ తరహా పిచ్పై బ్యాటర్లకు అతను డేంజరస్గా మారుతాడు. అతనిపై ఎదురుదాడికి దిగాలనే ప్రయత్నంలో ఔటవుతారు.
ఈ ఆలోచనతోనే అతన్ని జట్టులోకి తీసుకున్నాం. ఆరంభంలో అవకాశం ఇవ్వలేదు. కానీ న్యూజిలాండ్తో ఐదు వికెట్ల ఘనత అందుకున్నప్పుడు.. అతని సామర్థ్యం మాకు అర్థమైంది. ఆ ప్రదర్శనతోనే అతన్ని జట్టులో కొనసాగించాం. అతని బౌలింగ్లో గొప్ప క్వాలిటీ ఉంది. అదృష్టవశాత్తు అది మాకు ఉపయోగపడింది. సపోర్ట్ స్టాఫ్ మద్దతు అద్భుతం. జట్టు విజయంలో వారి పాత్ర కీలకం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
చెలరేగిన స్పిన్నర్లు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్వెల్(40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), డారిల్ మిచెల్(101 బంతుల్లో 3 ఫోర్లతో 63) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/45), కుల్దీప్ యాదవ్(2/40) రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(1/74), రవీంద్ర జడేజా(1/30) తలో వికెట్ పడగొట్టారు.
గెలిపించిన రాహుల్..
అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో) శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 48) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ (2/46), మైకేల్ బ్రేస్వెల్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రచిన్ రవీంద్ర, కైల్ జెమీసన్ చెరో వికెట్ పడగొట్టాడు.