టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ 99 పరుగుల వద్ద ఔటై ఒక్క పరుగు దూరంలో సెంచరీ అందుకోలేకపోయాడు. పంత్ సెంచరీ చేజార్చుకున్నా.. క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు.
వన్డే తరహా బ్యాటింగ్తో భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనకే సాధ్యమైన స్లాగ్ స్వీప్, స్టెప్ ఔట్ షాట్స్తో భారీ సిక్సర్లు బాదాడు. మొత్తం 105 బంతులు ఆడి 9 ఫోర్లు, 5 సిక్స్లతో 99 పరుగులు చేసాడు. ఇక అతను కొట్టిన ఓ సిక్సర్ ధాటికి బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. దాదాపు 107 మీటర్ల దూరం కొట్టిన ఈ సిక్సర్కు న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ నోరెళ్లబెట్టాడు. ఇందుకు సంబంధించి వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.

టీమ్ సౌథీ వేసిన 87వ ఓవర్లో పంత్ ఈ భారీ సిక్సర్ బాదాడు. ఈ ఓవర్ మూడో బంతిని పంత్.. స్లాగ్ స్వీప్ షాట్తో స్క్వేర్ లెగ్ దిశగా 107 మీటర్ల సిక్స్ బాదాడు. మోకాలిపై కూర్చోని పంత్ కొట్టిన ఈ షాట్కు గ్లేన్ ఫిలిప్స్ అవాక్కయ్యాడు. ఇదేం షాట్ అంటూ నోరెళ్లబెట్టాడు. పంత్ షాట్ ధాటికి బంతి స్టేడియం పైకప్పును తాకి బయట పడింది.
దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగిన రిషభ్ పంత్ను విలియమ్ ఓ రూర్కీ బౌల్డ్ చేశాడు. అతను వేసిన షార్ట్ పిచ్ బాల్ను పంత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను తాకింది. దాంతో పంత్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 231/3 ఓవర్నైట్ స్కోర్తో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి నాలుగో రోజు ఆటను ప్రారంభించిన పంత్.. సూపర్ బ్యాటింగ్తో నాలుగో వికెట్కు 177 పరుగులు జోడించాడు. సర్ఫరాజ్ ఖాన్(150) భారీ శతకం బాదాడు.
రిషభ్ పంత్ ఔటైన వెంటనే కేఎల్ రాహుల్(12), జడేజా(5) కూడా విఫలమయ్యాడు. దాంతో టీమిండియా 441 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అశ్విన్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉండగా.. భారత్ ఆధిక్యం 85 పరుగులకు చేరింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకు ఆలౌటవ్వగా.. న్యూజిలాండ్ 402 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ జట్టుకు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.