టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఒక్క పరుగు దూరంలో శతకాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్తో బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ దురదృష్టకర రీతిలో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్.. సర్ఫరాజ్ ఖాన్తో కలిసి నాలుగో వికెట్కు 177 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
వన్డే తరహా బ్యాటింగ్తో వేగంగా పరుగులు చేశాడు. 105 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విలియమ్ ఓ రూర్కీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీని పంత్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేయగా.. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి లెగ్ స్టంప్ను లేపేసింది.

ఈ అనూహ్య ఘటనతో అందరూ షాకయ్యారు. రిషభ్ పంత్.. ఆకాశం వైపు చూస్తూ నిరాశగా పెవిలియన్ చేరాడు. సెంచరీ చేజారినా కీలక ఇన్నింగ్స్ ఆడిన పంత్కు టీమిండియా ఆటగాళ్లంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి ప్రశంసించారు. విలియమ్ ఓ రూర్కీ వేసిన 89వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
టెస్ట్ ఫార్మాట్లో రిషభ్ పంత్ ఇలా 90ల్లో ఔటవ్వడం ఇది ఏడోసారి. 90ల్లో ఔటైన టీమిండియా బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ మొత్తం 10 సార్లు 90ల్లో ఔటవ్వగా.. రాహుల్ ద్రవిడ్ 9, రిషభ్ పంత్ 7, సునీల్ గవాస్కర్ 5, మహేంద్ర సింగ్ ధోనీ 5, వీరేంద్ర సెహ్వాగ్ ఐదు సార్లు ఔటయ్యారు.
టెస్ట్ల్లో 99 పరుగుల వద్ద ఔటైన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ నాలుగో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లమ్ 2005లో 99 పరుగుల వద్ద ఔటవ్వగా.. ధోనీ 2012లో, జానీ బెయిర్ స్టో 2017లో పంత్ కన్నా ముందు ఒక్క పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నారు.
రిషభ్ పంత్ ఆడిన గత ఐదు టెస్ట్ల్లో మూడో ఇన్నింగ్స్లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. గతేడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మూడో ఇన్నింగ్స్లో అజేయ సెంచరీతో రాణించిన పంత్, శ్రీలంకతో హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్తో హాఫ్ సెంచరీ.. ఈ ఏడాది బంగ్లాదేశ్తో సెంచరీ, తాజా మ్యాచ్లో 99 మూడో ఇన్నింగ్స్లోనే చేయడం గమనార్హం.
పంత్ ఔటైన వెంటనే కేఎల్ రాహుల్ కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 438/6 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది. క్రీజులో రవీంద్ర జడేజా(4 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 82 పరుగులకు చేరుకుంది.