టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్టన్నింగ్ ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్తో పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో జడేజా.. కళ్లు చెదిరే రనౌట్తో ఔరా అనిపించాడు. టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలో నో లుక్ రనౌట్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. జడేజా సూపర్ రనౌట్కు విలియమ్ ఓ రూర్కీ(0) ఆఖరి వికెట్గా పెవిలియన్ చేరాడు.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జడేజా వేసిన 70వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. జడేజా వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని గ్లేన్ ఫిలిప్స్ బ్యాక్ఫుట్ షాట్తో కవర్స్ వైపు ఆడగా.. వాషింగ్టన్ చాలా లేజీగా బంతిని అందుకున్నాడు. బంతి తన దగ్గరకు వచ్చేవరకు ఆగాడు. ఇది చూసిన ఫిలిప్స్... క్విక్ డబుల్కు ప్రయత్నం చేశాడు. దాంతో బంతిని అందుకున్న సుందర్.. నాన్స్ట్రైకర్వైపు విసిరాడు. బంతిని అందుకున్న జడేజా.. వికెట్ల వైపు చూడకుండా బంతిని విసిరాడు.

బంతి వికెట్లను తాకగా.. జడేజా డౌట్ఫుల్గా అప్పీల్ చేశాడు. రీప్లేలో విలియమ్ ఓ రూర్కీ క్రీజులోకి రాలేదని తేలింది. దాంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. జడేజా నో లుక్ రనౌట్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసింది. ఈ రనౌట్పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ధోనీ శిష్యుడా మజాకా! అంటూ కామెంట్ చేస్తున్నారు.
The Thala effect in Ravindra Jadeja's run out. 😄pic.twitter.com/tBoXdr27O6
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2024
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే(141 బంతుల్లో 11 ఫోర్లతో 76), రచిన్ రవీంద్ర(105 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(7/59), రవిచంద్రన్ అశ్విన్(3/64) కివీస్ పతనాన్ని శాసించారు.
అనంతరం భారత్.. తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(7/53) స్టన్నింగ్ బౌలింగ్తో టీమిండియా పతనాన్ని శాసించాడు. గ్లేన్ ఫిలిప్స్ 2 వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ ఓ వికెట్ పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38), యశస్వి జైస్వాల్(30), శుభ్మన్ గిల్(30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
103 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్(133 బంతుల్లో 10 ఫోర్లతో 86) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(4/56) నాలుగు వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టారు. భారత్ ముందు 359 పరుగుల లక్ష్యం నమోదైంది. భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 147 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.