అసలేం జరిగిందంటే..
మూడో రోజు ఆటలో భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్.. అంపైర్ల తప్పిదానికి తోడు రహానే అలసత్వంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 66 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అశ్విన్ బౌలింగ్లో లాథమ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్ వేసిన ఫుల్ లెంగ్త్ బాల్ను అంచనా వేయడంలో విఫలమైన లాథమ్ ఆడలేకపోయాడు. దాంతో బంతి నేరుగా అతని ప్యాడ్లను తాకగా.. భారత ఆటగాళ్లంతా గట్టిగా అప్పీల్ చేశారు. అయితే అంపైర్ నాటౌట్ ఇవ్వలేదు. బంతి బాగా టర్న్ అయిందని భావించిన కెప్టెన్ అజింక్యా రహానే రివ్యూ తీసుకోలేదు. అయితే టీవీ రిప్లేలో బంతి నేరుగా వికెట్లను హిట్ చేసినట్లు కనిపించింది. దాంతో భారత ఆటగాళ్లకు తాము చేసిన తప్పిదం ఏంటో తెలుసొచ్చింది. ఆ అసహనంలో అశ్విన్ నేలను గట్టిగా తన్నాడు. రివ్యూ తీసుకోకపోవడంపై పశ్చాతాపానికి గురయ్యాడు. రహానే సైతం అదే ఫీలింగ్ను వ్యక్తపరిచాడు.

మూడు సార్లు రివ్యూతోనే..
అయితే రహానే రివ్యూ తీసుకోపోవడానికి బలమైన కారణం కూడా ఉంది. అంతకుముందు టామ్ లాథమ్ మూడు సార్లు రివ్యూ తీసుకొని ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇషాంత్ శర్మ వేసిన మూడో ఓవర్లోనే లాథమ్ను అంపైర్ ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అయితే, డీఆర్ఎస్లో బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుందని తేలింది. తర్వాత 15వ ఓవర్లో జడేజా బౌలింగ్లోనూ లాథమ్ మరోసారి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ రివ్యూకి వెళ్లి బతికిపోయాడు. 56వ ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ బంతికి లాథమ్ క్యాచ్ ఔట్ అయినట్లు భావించి అంపైర్ వేలెత్తాడు. సమీక్షలో బంతి ప్యాడ్ను తాకి వికెట్ కీపర్ చేతుల్లో పడిందని తేలింది. దీంతో మూడోసారి కూడా లాథమ్ బతికిపోయాడు. ఈ క్రమంలోనే రహానే రివ్యూ తీసుకునేందుకు సాహసం చేయలేదు.

ఆ ట్రిక్ మర్చిపోయింది..
అయితే అశ్విన్ బౌలింగ్లో లాథమ్ ఔటైనప్పుడు భారత జట్టు రివ్యూ తీసుకోవాల్సిందని, ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరిస్తున్న దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అన్నారు. రివ్యూ తీసుకుంటే ఒకవేళ ఔట్ కాకపోయినా అంపైర్స్ కాల్తో మళ్లీ రివ్యూ రిటైన్ అయ్యేదని, ఈ ట్రిక్ను టీమిండియా మర్చిపోయిందని చెప్పాడు. అది చాలా క్లోజ్డ్ కాల్ అని, ఇంత అలసత్వం పనికిరాదని విమర్శించారు. ఒకవేళ రివ్యూ తీసుకొని ఉంటే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఇప్పటికే ముగిసేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ అవకాశాన్ని అందుకున్న లాథమ్.. అదనంగా 29 పరుగులు జోడించి 95 పరుగుల వద్ద ఔటయ్యాడు.

చెత్త అంపైరింగ్..
ఇక మరో ఓపెనర్ విల్ యంగ్ వికెట్ విషయంలో కూడా అంపైర్లు ఘోర తప్పిదం చేశాడు. అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ ఔటైన అతన్ని నాటౌట్ ప్రకటించారు. అయితే వికెట్ కీపర్ కేఎస్ భరత్ పట్టుబట్టి మరీ రివ్యూ తీసుకొని ఫలితం రాబట్టాడు. దాంతో ఈ మ్యాచ్లో అంపైర్ల తప్పిదాల సంఖ్య ఐదుకు చేరింది. ఈ క్రమంలోనే వారిపై నెటిజన్లు మండిపడుతున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు విల్ యంగ్, టామ్ లాథమ్ ఔటైన తర్వాత కివీస్ ఇన్నింగ్స్ పేకమేడల్లా కూలింది. అక్షర్ పటేల్ ఐదు వికెట్లతో చెలరేగడంతో కివీస్ బ్యాట్స్మన్గా వరుసగా పెవిలియన్ చేరారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
