ఐదు టీ20ల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది.
కెప్టెన్ మిచెల్ సాంట్నర్(27 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 47 నాటౌట్), రచిన్ రవీంద్ర(26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 44) రాణించారు. చివర్లో జాక్ ఫోక్స్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 15 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(2/35) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఆశించిన ఆరంభం దక్కింది. తొలి మ్యాచ్లో విఫలమైన ఓపెనర్ డెవాన్ కాన్వే(19) దూకుడుగా తమ ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. టీమ్ సిఫెర్ట్(24) కూడా బౌండరీలు బాదడంతో 3.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ 43 పరుగులు చేసింది. కానీ ఈ జోడీని హర్షిత్ రాణా విడదీసాడు. డెవాన్ కాన్వేను క్యాచ్ ఔట్గా బోల్తా కొట్టించాడు. వరుసగా నాలుగోసారి అతని వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు.
ఆ మరుసటి ఓవర్లో టీమ్ సీఫెర్ట్ను వరుణ్ చక్రవర్తీ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర, ఫిలిప్స్ ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో న్యూజిలాండ్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.
పవర్ ప్లే అనంతరం కుల్దీప్ యాదవ్ను బరిలోకి దింపిన సూర్య ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. డేంజరస్ ఫిలిప్స్(19)ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రచిన్ రవీంద్ర తన దూకుడు కొనసాగించాడు. మూడు బౌండరీలతో జోరు కనబర్చిన డారిల్ మిచెల్(18)ను శివమ్ దూబే ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీకి చేరువైన రచిన్ రవీంద్ర(44)ను కుల్దీప్ యాదవ్ క్యాచ్ ఔట్ చేశాడు.
వరుసగా వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం తగ్గింది. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడిన చాప్మన్(10)ను హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. వరుసగా వికెట్లు పడ్డా కెప్టెన్ మిచెల్ సాంట్నర్ దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. చివర్లో జాక్ ఫోక్స్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 15 నాటౌట్) దూకుడుగా ఆడి జట్టు స్కోర్ను 200 పరుగులు ధాటించాడు.