పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక సలహా ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తరహాలో జడేజా తన ఆటను మెరుగుపర్చుకోవాలని సూచించాడు.
ఆటలో కొత్త ప్రయోగాలు చేయాలని జడేజాకు తాను ఎప్పుడూ చెబుతూ ఉంటానని, కానీ అతను తన బౌలింగ్ శైలిని మార్చుకోడని చెప్పాడు. కొన్నేళ్లుగా బ్యాటింగ్, బౌలింగ్లో నిలకడగా రాణిస్తుండటంతోనే జడేజా ఇలా మొండిగా తయారయ్యాడని తెలిపాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో జడేజా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో తీవ్రంగా నిరాశపర్చిన జడేజా బౌలింగ్లో ఒకే ఒక్క వికెట్ తీసాడు. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. అతని వైఫల్యం టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేసింది. ఈ సిరీస్లో 2 1తో భారత్ ఘోర పరాజయం చవిచూసింది.

ఈ క్రమంలోనే తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా జడేజా గురించి మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'జడేజాకు తాను నమ్మే కొన్ని బలాలు ఉన్నాయి. అతను తన బలాలకు మించి ఏమి చేయడు. కాస్త నెమ్మదిగా.. భిన్నంగా బౌలింగ్ చేయాలని సూచించినా పట్టించుకోడు. ఎందుకంటే జడేజా తన బలాలను నమ్ముకొనే బౌలింగ్ చేస్తాడు.
అతని బలాలే కొన్నిసార్లు బలహీనతలుగా మారుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో అతనికి ఉన్న నైపుణ్యం అసాధారణం. కానీ కొత్త ప్రయోగాలు చేయడు. నెట్స్లో క్యారమ్ బాల్స్ వేస్తాడు, కానీ మ్యాచ్లో మాత్రం ప్రయత్నించడు. లెజెండ్ అయిన జడేజాకు కోల్పోయేదేమీ లేదు. కొంచెం ఫంకీగా ఆడితే చూడాలని ఉంది. అతను నిరూపించుకోవాల్సింది కూడా ఏం లేదు. ఎప్పటికీ జడేజా దిగ్గజమే.
విరాట్ కోహ్లీలా జడేజా కూడా తన ఆటను మెరుగుపర్చుకోవాలి. కోహ్లీ ప్రస్తుతం ఎలాంటి చింత లేకుండా ఆడుతున్నాడు. ఈ ప్రపంచానికి తానే రాజును అన్నట్లు ఆటను ఆస్వాదిస్తున్నాడు. అందుకే అతను ఇంత బాగా రాణిస్తున్నాడు.
జడేజాకు ఇది సవాల్తో కూడిన సమయం. అక్షర్ పటేల్ అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్దంగా ఉన్నాడు. జడేజా వన్డేల్లో ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేశాడు. కానీ ఇప్పుడు చర్చంతా అతని బ్యాటింగ్ చుట్టూనే తిరుగుతోంది. స్పిన్నర్లపై తక్కువ స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడే ఎవరి భవిష్యత్తుపై తీర్పు ఇవ్వడం తొందరపాటు అవుతుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.