న్యూజిలాండ్తో తొలి టెస్ట్లో టీమిండియా దారుణంగా విఫలమైంది. చెత్త బ్యాటింగ్తో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. బౌలింగ్లోనూ అదే తడబాటు కొనసాగించింది. చెత్త ఫీల్డింగ్తో వచ్చిన అవకాశాలను చేజార్చుకుంది. దాంతో న్యూజిలాండ్ పై చేయి సాధించింది. భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 50 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. క్రీజులో రచిన్ రవీంద్ర(22 బ్యాటింగ్)తో పాటు డారిల్ మిచెల్(14 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 134 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. టామ్ లాథమ్(15) విఫలమైనా.. డెవాన్ కాన్వే(91), విల్ యంగ్(33) రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేలా తలో వికెట్ తీసారు.

వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచి పెట్టుకుపోగా.. రెండో రోజు ఆటలో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్కు దిగింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 31.2 ఓవర్లలో 46 పరుగులకు ఆలౌటైంది.
రిషభ్ పంత్(49 బంతుల్లో 2 ఫోర్లతో 20), యశస్వి జైస్వాల్(63 బంతుల్లో ఫోర్తో 13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/15), విలియమ్ ఓ రౌర్కే(4/22), టీమ్ సౌథీ(1/8) భారత్ పతనాన్ని శాసించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియాకు ఇదే లోయేస్ట్ స్కోర్.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ స్వేచ్చగా బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటర్లు తడబడ్డ వికెట్పై ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించింది. టామ్ లాథమ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను కేఎల్ రాహుల్ నేలపాలు చేయగా.. అతన్ని కుల్దీప్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం విల్ యంగ్ ఇచ్చిన సునాయస క్యాచ్ రోహిత్ శర్మ వదిలేయగా... రవీంద్ర జడేజా రనౌట్ అవకాశాన్ని వృథా చేశాడు.
టీమిండియా ఆటగాళ్లు చేసిన తప్పిదాలు న్యూజిలాండ్కు కలిసొచ్చాయి. విల్ యంగ్ను జడేజా ఔట్ చేయగా.. సెంచరీకి చేరువైన డెవాన్ కాన్వేను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక రిషభ్ పంత్ తీవ్ర గాయంతో మైదానం వీడగా.. ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయం కన్నా ముందే అంపైర్లు ఆటను ముగించారు. వీలైనంత త్వరగా న్యూజిలాండ్ను ఆలౌట్ చేస్తేనే టీమిండియా ఈ మ్యాచ్లో గట్టెక్కగలదు. లేకుంటే ఘోర పరాజయం తప్పదు.