న్యూజిలాండ్తో జరగనున్న అప్కమింగ్ మూడు వన్డేల సిరీస్కు సంబంధించి టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ నుంచి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతివ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భావిస్తున్నట్లు సమాచారం.
జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ నేపథ్యంలో జట్టు ప్రకటనను ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2025 నేపథ్యంలో ఈ టోర్నీకి ఎంపికైన చాలా మంది ఆటగాళ్లను వన్డే సిరీస్కు దూరంగా ఉంచాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్లో హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 3 ఇన్నింగ్స్ల్లో 142 పరుగులు చేయడమే కాకుండా, టీ20ల్లో 100 వికెట్లు, 100 సిక్సర్లు బాదిన అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యాతో పాటు జస్ప్రీత్ బుమ్రా వర్క్లోడ్ను తగ్గించాలనే ఈ ఇద్దర్ని వన్డే సిరీస్కు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా చివరి వన్డే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఆడాడు. మరోవైపు బుమ్రా.. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఒక్క వన్డే మ్యాచ్ ఆడలేదు.
అంతర్జాతీయ మ్యాచ్లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ నయా రూల్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ తొలి రెండు మ్యాచ్లు ఆడారు. హార్దిక్ చివరి మ్యాచ్లు ఆడే ఛాన్స్ ఉంది. విజయ్ హజారేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ.. మరో మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత భారత జట్టుతో కలవనున్నాడు.
తొలి వన్డే: జనవరి 11న వడోదర
రెండో వన్డే: జనవరి 14న రాజ్కోట్
మూడో వన్డే: జనవరి 18న ఇండోర్
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జనవరి 4, 5 తేదీల్లో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా స్థానంలో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం దక్కనుంది. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వవచ్చు.