
హైదరాబాద్: భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్లు ఆడనున్న న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. శనివారం ఉదయం 5.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి కివీస్ జట్టు చేరుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)అధికారులు విమానాశ్రయంలో కివీస్ ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు. పటిష్ట భద్రత నడుమ కివీస్ బృందాన్ని తాజ్ కృష్ణా హోటల్కు తరలించారు. శనివారం పూర్తిగా రెస్ట్ తీసుకున్న కివీస్ టీమ్ ఆదివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్తో పాటు ఇతర ఆటగాళ్లు నెట్స్లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ పోలీసులతో భద్రత కల్పించారు. పాకిస్థాన్ పర్యటనలో వన్డే సిరీస్ను 2-1తో గెలిచిన కివీస్ మంచి జోరు మీద ఉంది. బుధవారం హైదరాబాద్ వేదికగా తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే రాయ్ పూర్ వేదికగా శనివారం(జనవరి 21) జరగనుండగా.. మూడో వన్డే ఇండోర్ వేదికగా జనవరి 24న జరగనుంది. మూడు టీ20ల సిరీస్ రాంచీ వేదికగా జనవరి 27న ప్రారంభం కానుంది. రెండో టీ20 ఆదివారం లక్నో వేదికగా.. చివరి టీ20 అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 1న జరగనుంది.
శ్రీలంకతో తిరవనంతపురం వేదికగా నేడు జరిగే చివరి వన్డే అనంతరం భారత్ సోమవారం హైదరాబాద్ చేరుకోనుంది. ఈ మ్యాచ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. టికెట్లన్నీ ఆన్లైన్లోనే విక్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే పూర్తిగా అమ్ముడయ్యాయి. ఈ వన్డే, టీ20 సిరీస్లకు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా.. కేఎస్ భరత్ వన్డేల్లో, జితేశ్ శర్మ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.